మిగిలిన రాష్ట్రాల్లాగే టి, విలీనంపై బిల్లు తర్వాతే: కెసిఆర్
న్యూఢిల్లీ: తెలంగాణపై ఎలాంటి ఆంక్షలు అంగీకరించేది లేదని, ఇతర రాష్ట్రాల్లాగే ఉండాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు. డిసెంబర్లో తెలంగాణ ప్రక్రియ పూర్తవుతుందని, బిల్లు పెట్టాక విలీనంపై ఆలోచిస్తామని చెప్పారు. మంత్రుల బృందంతో (జివోఎం)తో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
హైదరాబాదు పైన ఎలాంటి ఆంక్షలు విధించవద్దని తాము జివోఎం సభ్యులను కోరామన్నారు. మిగిలిన రాష్ట్రాలకు ఎలాంటి విధివిధానాలు ఉన్నాయో తెలంగాణకు అలాగే ఉండాలన్నారు. డిసెంబరులో బిల్లు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీలో తెరాస విలీనంపై ప్రశ్నించగా... పార్లమెంటులో బిల్లు పాసయ్యాక నిర్ణయిస్తామన్నారు. విభజన ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తవుతుందని జివోఎం చెప్పిందన్నారు.
హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఐదేళ్లు ఉంచాలని తాము కోరామని, దానికి మంత్రుల బృందం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. హైదరాబాదు పైన లేదా తెలంగాణ పైన ఎలాంటి ఆంక్షలు పెట్టినా తెలంగాణ ప్రజలను అవమానించినట్లే అవుతుందన్నారు.
ప్రజలు ఎలాంటి తెలంగాణ కోరుకుంటున్నారో తాము వారికి వివరించామన్నారు. పార్లమెటుకు బిల్లు వచ్చే వారం రోజుల ముందు తాము ఢిల్లీకి వచ్చి అన్ని పార్టీల నాయకులను కలుస్తామని చెప్పారు. 29వ రాష్ట్రంగా ఏర్పడబోతున్న తెలంగాణ మిగతా 28 రాష్ట్రాలకు ఎలాంటి హక్కులున్నాయో అలాగే ఉండాలన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జివోఎం భేటీకి రాకపోవడం ద్వారా తన తెలంగాణ వ్యతిరేకతను బయట పెట్టుకున్నారన్నారు. బాబు చెబుతున్న సమన్యాయం అంటే ఏమిటో చెప్పాలన్నారు.