విశాఖ నీటిలోనూ సీసం- వదిలేస్తే ఏలూరు గతే- జగన్కు రిటైర్డ్ ఐఏఎస్ లేఖ
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తాగునీటిలో క్రిమిసంహారకాలు కలవడం వల్ల ప్రజలు భారీ సంఖ్యలో అస్వస్ధతకు గురయ్యారు. ఇప్పుడిప్పుడే ఈ వ్యాధికి గల కారణాలను డాక్టర్లు వెల్లడిస్తున్నారు. సీసం, ఆర్గానో క్లోరిన్ కలవడం వల్లే తాగునీరు విషతుల్యమై ఇంతమంది బాధితులుగా మారినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలోనూ దాదాపు అలాంటి పరిస్ధితులే ఉన్నాయని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ సీఎం జగన్తో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలకు రాసిన లేఖలు కలకలం రేపుతున్నాయి.
Recommended Video
విశాఖలో తాగునీరు కాలుష్యం
విశాఖ నగరంలో ప్రస్తుతం ప్రజలకు సరఫరా అవుతున్న తాగునీరు కలుషితం అవుతోందని, ఇందులోనూ సీసం ఆనవాళ్లు కనిపిస్తున్నాయని విశ్రాంత ఐఏఎస్ అదికారి ఈఏఎస్ శర్మ ఏపీ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. నగరంలో నీటి కాలుష్య సమస్య తీవ్రంగా ఉందని, మంచి నీటి వనరుల్లో హానికారక పదార్ధాలు కలుస్తున్నాయని ఆయన ఫ్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. తాజాగా క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదికను ఇందుకు ఆయన ఆధారంగా చూపారు. తక్షణం దీనిపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్తో పాటు ప్రభుత్వంలోని సంబంధిత శాఖల అధికారులకూ ఆయన ఫిర్యాదు చేశారు.
విశాఖ నీటిలోనూ సీసం ఆనవాళ్లు..
విశాఖ నగరానికి ప్రస్తుతం సరఫరా అవుతున్న తాగునీటిలో సీసం పరిణామం అధికంగా ఉందని సీఎంకు రాసిన లేఖలో విశ్రాంత ఐఏఎస్ అధికారి శర్మ వివరించారు. ఏలూరు ఘటనకూ ఇదే కారణమన్నారు. వాస్తవానికి విశాఖ నగరంతో పాటు పలు పట్టణాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మంచినీటి వనరులు, పైపులైన్ వ్యవస్ధలు, పైపులైన్లకు వినియోగించే పైపుల నాణ్యత వంటి అంశాలు నీటి కాలుష్యానికి కారణమవుతున్నాయని ఆయన తన ఫిర్యాదులో తెలిపారు. కాబట్టి కాలుష్యానికి కారణమవుతున్న అంశాలపై లోతైన దర్యాప్తు జరిపించి తగు చర్యలు తీసుకోవాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి శర్మ ప్రభుత్వాన్ని కోరారు.
దేశంలోని 26 నగరాల్లో ఇదే పరిస్ధితి..
దేశవ్యాప్తంగా తాగునీటి కాలుష్యంపై తాజాగా క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదికలో పలు కీలక అంశాలున్నాయి. ఇందులో దేశంలోని 26 నగరాల్లో నీటి కాలుష్య సమస్య తీవ్రంగా ఉందని క్యుసీఐ తెలిపింది. ఇందులో విశాఖ నగరం కూడా ఉండటంతో ఇప్పుడు విశ్రాంత ఐఏఎస్ ఈఏఎస్ శర్మ ప్రభుత్వానికి చేసిన ఫిర్యాదు ప్రాధాన్యత సంతరించుకుంది. క్యుసీఐ అధ్యయనంలో పురపాలక, నగరపాలక సంస్ధల్లో సీసం పూతతో తయారవుతున్న పీవీసీ పైపుల వినియోగం కూడా నీరు విషతుల్యం కావడానికి కారణమవుతోందని పేర్కొంది. దీన్ని ప్రస్తావిస్తూ శర్మ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. రాజధాని కాబోతున్న విశాఖ వంటి కీలక నగరంలో తీసుకోవాల్సిన చర్యలను ఆయన తన లేఖలో ప్రభుత్వానికి సూచించారు.