ఎవరెవరో వచ్చి ఇబ్బంది పెట్టారు: జడ్జితో రేవంత్, ఇక బాబు ఎంత: కేటీఆర్
హైదరాబాద్: నాలుగు రోజుల కస్టడీ అనంతరం రేవంత్ రెడ్డిని, ఉదయ్ సిన్హా, సెబాస్టియన్లను ఏసీబీ ఆధికారులు మంగళవారం న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు.
ఏసీబీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా అని న్యాయమూర్తి ప్రశ్నిస్తే రేవంత్ సమాధానం ఇచ్చారు. ఏసీబీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు.
కార్యాలయంలో తమకు కనీస సౌకర్యాలు కల్పించలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. సిట్ కార్యాలయంలో గార్డులు కూర్చున్న చోట తమను పడుకోమని చెప్పారన్నారు. తాగునీరు, ఫలహారం కూడా ఇవ్వలేదన్నారు. గొంతు నొప్పిగా ఉందన్నప్పటికీ పట్టించుకోలేదని చెప్పారు.
డిపార్టుమెంటుకు సంబంధం లేని వారు కార్యాలయానికి వచ్చి సిట్ తమతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని చెప్పారు. కాగా, నిందితులకు న్యాయస్థానం 15వ తేదీ వరకుజ్యూడిషియల్ రిమాండ్ పొడిగించింది. ఏసీబీ నాలుగు రోజుల కస్టడీ నివేదికను కోర్టుకు సమర్పించింది.
పీవీనే విచారించారు.. బాబు ఎంత: కేటీఆర్
ఓటుకు నోటు వ్యవహారంపై మంత్రి కేటీ రామారావు మంగళవారం ఘాటుగా స్పందించారు. ముడుపుల వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని చెప్పారు. ఆయనను చట్టం శిక్షిస్తుందని చెప్పారు. చట్టం ముందు ఎవరైనా సమానమే అన్నారు.
ప్రజల మధ్య చిచ్చు పెట్టవద్దన్నారు. తెలుగు జాతి సిగ్గుపడేలా టీడీపీ వ్యవహరిస్తోందన్నారు. చంద్రబాబు శిఖండి రాజకీయాలు చేస్తున్నారన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్నారు.
ఓటుకు నోటు వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చేందుకు యత్నిస్తున్నారన్నారు. అప్పట్లో అవినీతి కేసులో పీవీ అంతటి వాడినే విచారించారని, పక్కా ఆధారాలుండటంతో చంద్రబాబు చట్టం నుండి తప్పించుకోలేరన్నారు.
సభాపతిని కలిసిన టీడీపీ నేతలు
తెలంగాణ శాసన సభాపతిని తెలంగాణ టీడీపీ నేతలు కలిశారు. పార్టీ వీడిన ఎమ్మెల్యేలను తొలగించాలని కోరారు. టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, ఎల్ రమణ తదితరులు సభాపతిని కలిశారు.
అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. హైదరాబాదు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. బాబు సీఎంగా ఉండటం కేసీఆర్, కేటీఆర్లకు ఇష్టం లేదన్నారు. హైదరాబాదు పోలీసుల తీరు పైన గవర్నర్ జోక్యం చేసుకోవాలన్నారు.