రేవంత్ రెడ్డి ఇష్యూ: నోరు విప్పని కెసిఆర్, టిడిపియే టార్గెట్
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంపై ఇప్పటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నోరు విప్పలేదు. అరెస్టుకు ముందు టిఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశంలో ఆయన ఓ వ్యాఖ్య చేసినట్లు వార్తలు వచ్చాయి. గంటలో మీకో మంచి వార్త వస్తుందని ఆయన టిఆర్ఎస్ శాసనసభ్యులతో అన్నట్లు ఆ వార్తలు వచ్చాయి. అంతకు మించి దానిపై ఆయన మాట్లాడినట్లు లేదు.
అయితే, కెసిఆర్ రేవంత్ రెడ్డి విషయంలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులను పెట్టి పోటీని అనివార్యం చేయడం, ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోవడం ఆయన వ్యూహంలో భాగమేనని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి ఓడిపోవడాన్ని బట్టి కూడా ఆయన లక్ష్యం టిడిపి మాత్రమేనని అర్థమవుతోంది.
కాంగ్రెసు పార్టీకి చెందిన 18 మంది శాసనసభ్యులు కూడా తమ పార్టీ అభ్యర్థి ఆకుల లలితకు ఓటేశారు. దాంతో కాంగ్రెసుకు ఏ విధమైన నష్టమూ జరగలేదు. కానీ, టిడిపియే ఘోరంగా దెబ్బ తింది. టిడిపిని తెలంగాణలో లేకుండా చేయడమే లక్ష్యంగా కెసిఆర్ పావులు కదిపినట్లు అర్థమవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే పదే తనను లక్ష్యం చేసుకుని వ్యాఖ్యలు చేయడాన్ని కెసిఆర్ మనసులో పెట్టుకున్నట్లు భావిస్తున్నారు.
అదే సమయంలో రేవంత్ రెడ్డి కెసిఆర్పై దూకుడుగా వ్యవహరిస్తూ విమర్శల జడివాన కురుపిస్తూ వచ్చారు. రేవంత్ రెడ్డి ఒకరకంగా కెసిఆర్కు కంట్లో నలుసులా తయారయ్యారు. రేవంత్ రెడ్డిని పక్కకు తొలగించడమే కాకుండా టిడిపిని నైతికంగా దెబ్బ తీయడంలో కెసిఆర్ పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరించారని అంటున్నారు.
కాంగ్రెసు ఉనికిలో ఉండడం వల్ల కెసిఆర్కు పెద్దగా నష్టం లేదు. కానీ, టిడిపి అదును చూసుకుని తెలంగాణలో విజృంభించే అవకాశం ఉంది. టిడిపికి తెలంగాణలో క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ కూడగట్టుకునేందుకు టిడిపి నాయకులు ప్రయత్నాలు ప్రారంభించి, తన ప్రభుత్వంపై సమరానికి దిగితే భవిష్యత్తులో నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదని కెసిఆర్ భావించినట్లు చెబుతారు. అందువల్లనే టిడిపిని లక్ష్యం చేసుకుని ఆయన ఆపరేషన్ ప్రారంభించినట్లు చెబుతున్నారు.
ఇప్పటికే పలువురు టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్ఎస్లో చేరారు. త్వరలో వచ్చే హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి సహకారంతో టిడిపి రంగంలోకి దిగితే తన పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందనేది ఆయన ఆలోచనగా చెప్తారు. దాంతో హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో టిడిపి విమర్శనాస్త్ర్లాలు సంధించి, ప్రజలను ఆ పార్టీకి వ్యతిరేకంగా మలచడానికి రేవంత్ రెడ్డి వ్యవహారం కలిసి వస్తుందని కూడా భావిస్తున్నారు.
మొత్తం మీద, టిడిపిని తెలంగాణలో నామరూపాలు లేకుండా చేయాలనే పక్కా ప్రణాళిక రచించుకుని కెసిఆర్ నెమ్మదిగా అడుగులు వేస్తున్నట్లు భావిస్తున్నారు.