కావూరిని కౌగలించుకుందెవరు: రేవంత్ రెడ్డి ఫైర్
తెలంగాణ ఇస్తే తెరాస తమ పార్టీలో విలీనమవుతుందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చెప్పారని, విలీనం చేస్తానని కెసిఆర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. తెరాసను విలీనం చేయకపోవడం వల్లనే తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం కాలయాపన చేస్తోందని ఆయన అన్నారు. తెరాసతో రాజకీయాలు కావాలో, తెలంగాణ కావాలో కెసిఆర్ తేల్చుకోవాలని ఆయన అన్నారు. తెరాసను కాంగ్రెసులో విలీనం చేస్తారా లేదా కెసిఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దిగ్విజయ్ సింగ్ ప్రకటన, కెసిఆర్ ప్రకటన హరీష్ రావుకు కనిపించలేదా అని ఆయన అడిగారు.
గతంలో రాష్ట్రాలు ఏర్పడినప్పుడు మూడు, నాలుగు రోజులు మాత్రమే శాసనసభల్లో చర్చలు జరిగాయని, 14 రాష్ట్రాల నుంచి 28 రాష్ట్రాలు ఏర్పడిన పలు సందర్భాల్లో అలాగే చర్చలు జరిగాయని, తెలంగాణ ఏర్పాటుకు మాత్రం 40 రోజుల వ్యవధి ఇచ్చారని ఆయన చెప్పారు. చర్చల పేరిట తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెసు కాలయాపన చేస్తుండడం తెరాసకు కనిపించడం లేదా అని ఆయన అడిగారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు సార్లు లేఖలు రాశారని, చంద్రబాబు లేఖ వల్లనే కాంగ్రెసు అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. చంద్రబాబును తెలంగాణవాది అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అంటున్నారని ఆయన అన్నారు.
చంద్రబాబు సమైక్యవాదో, తెలంగాణవాదో కెసిఆర్, జగన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటిస్తే హరీష్ రావు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తానని చెప్పారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు మాత్రమే కాకుండా సీమాంధ్ర ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత కూడా తమ పార్టీపై ఉందని ఆయన చెప్పారు.
తెలంగాణ పేరు మీద స్వార్థంతో కెసిఆర్ కుటుంబ సభ్యులు ఆస్తులను పెంచుకోవడానికి ప్రయత్నించారని ఆయన విమర్శించారు. తెలంగాణకు చెందిన మంత్రి కె. జానా రెడ్డి ఇంటికి వెళ్లి కెసిఆర్ ఏం మాట్లాడారో తెలంగాణ ప్రజలకు చెప్పాలని ఆయన అన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటే తెలంగాణ నాయకులమంతా కలిసి మాట్లాడుకోవాలని, కెసిఆర్ ఒక్కరు వెళ్లి జానా రెడ్డితో మాట్లాడడమేమిటని ఆయన అన్నారు.