నేతలు రావొద్దు ప్లీజ్!: ఫ్యామిలీని మాత్రమే కలిసేందుకు రేవంత్ ఆసక్తి
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నారు. ఆయన తనను రాజకీయ ప్రముఖులు కలిసేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. న్యాయవాదులు, కుటుంబ సభ్యులు మినహా ఎవరినీ కలవడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదని అధికారులు చెబుతున్నారు.
బుధవారం నాడు ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, మాగంటి గోపినాథ్లు రాగా.. ఆయనను కలిసేందుకు రేవంత్ నిరాకరించినట్లుగా తెలుస్తోంది. ఆయనను కలిసినట్లు కొందరు చెబుతున్నారు. మొత్తానికి రేవంత్ కుటుంబ సభ్యులు, న్యాయవాదులు మినహా మిగతా వారిని కలిసేందుకు ఆసక్తి చూపించండం లేదని తెలుస్తోంది.
కొండగల్ నుండి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు ఆయనను చూసేందుకు బుధవారం వచ్చారు. అందరికీ అధికారులు అవకాశం ఇవ్వలేదు.
జైలు నిబంధనల ప్రకారం ఎక్కువ మందికి తాము ములాకత్ అవకాశం ఇవ్వలేమని, కాబట్టి ఆయన ఎక్కువ శాతం కుటుంబ సభ్యులను కలిసేందుకే ఆసక్తి చూపిస్తున్నారని అధికారులు అంటున్నారు. అదే సమయంలో తన కూతురు ఎంగేజ్మెంట్, పెళ్లి కూడా ఉందని అంటున్నారు. కాబట్టి, జైలుకు కుటుంబ సభ్యులనే పంపించాలని ఆయన పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారని సమాచారం.
రేవంత్రెడ్డికి జైల్లో ప్రత్యేక వసతులు
రేవంత్ రెడ్డికి జైలులో ప్రత్యేక వసతులు కల్పించేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. రేవంత్ ఎమ్మెల్యేగా ఉన్నారని, అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రత్యేక వసతులు కల్పించాలని విన్నవించారు. దీనిపై ఏసీబీ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో కోర్టు ఇందుకు అంగీకరించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయసింహ తమకు కూడా జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలంటూ దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం విచారణ జరగనుంది.