విరసం నేత, ప్రముఖ రచయిత చలసాని ప్రసాద్ కన్నుమూత
విశాఖపట్నం: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత, ప్రముఖ రచయిత చలసాని ప్రసాద్ కన్ను మూశారు. ఆయన వయస్సు 83 ఏళ్లు. ఆయన శనివారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో తన నివాసంలోనే గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. అంబులెన్స్ చేరుకునేలోగానే ఆయన మరణించారు.
చలసాని ప్రసాద్ స్వస్థలం కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రు. విరసం స్థాపనలో ఆయనది కీలకమైన పాత్ర. అత్యవసర పరిస్థితి కాలంలో ఆయన జైలుకు వెళ్లారు. నమ్మిన విప్లవ సిద్ధాంతానికి కట్టుబడిన ఆయన పలుమార్లు జైలుకు వెళ్లారు. కవిగా, రచయితగా, విమర్శకుడిగా ఆయనకు మంచి పేరుంది.

శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్త్రి, కెవిఆర్లతో ఆయన సన్నిహిత సంబంధాలుండేవి. పలు గ్రంథాలను ఆయన సంకలనం చేశారు. శ్రీశ్రీ సాహిత్యంపై ఆయనకు ఎనలేని పట్టు ఉంది. సాంస్కృతిక, సాహిత్య ఉద్యమాల్లో ఆయన ముఖ్యమైన భూమిక పోషించారు.
చలసాని ప్రసాద్కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విప్లవ సాహిత్యోద్యమంలో ఆయన చివరి శ్వాస వరకు పాల్గొంటూ వచ్చారు. కమ్యూనిస్టు కుటుంబంలో జన్మించిన ఆయన చివరి వరకు కమ్యూనిస్టుగానే కొనసాగారు. ఆయన మృతి పట్ల విరసం సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications