"గోడ మీద పిల్లిలా కాదు పవన్.. కొమురం పులిలా పోరాడు"
తిరుపతి : హోదా రగడ ఏపీ రాజకీయాల్లో రగులుతూనే ఉంది. ప్యాకేజీని స్వీకరించడానికి సిద్దమైన టీడీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. విపక్షాలు ఆందోళన బాట పట్టాయి. ఆందోళనలను పోలీసులు అణిచేసే ప్రయత్నం చేస్తుండడంతో.. అఖిలపక్షం ఆధ్వర్యంలో పార్టీలన్ని తిరుపతిలో సామూహిక నిరాహార దీక్షకు దిగాయి. దీక్షలో పాల్గొన్న వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ప్రభుత్వ తీరుపై, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
పవన్ కళ్యాణ్ పై పలు విమర్శలు గుప్పించిన రోజా.. పవన్ నిజంగా ప్రజాసేవ చేయాలనుకుంటే పూర్తిస్థాయి రాజీకీయ నేతగా రంగంలోకి దిగాలని సవాల్ విసిరారు. పార్టీలకు తొత్తులా గోడ మీద పిల్లిలా వ్యవహరించడం కాకుండా.. కొమురం పులిలా ప్రజలు తరుపున నిలిచి పోరాడాలని పవన్ కు హితవు పలికారు. కలియుగ వెంకన్న సాక్షిగా తిరుపతిలో టీడీపీ బీజేపీలతో కలిసి పవన్ ఇచ్చిన ప్రత్యేక హోదా హామిని ఈ సందర్బంగా గుర్తు చేశారు రోజా.
ఇక సీఎం పదవిని అడ్డంపెట్టుకుని చంద్రబాబు చేస్తోన్న అరాచాకాలు అన్నీ ఇన్నీ కావని విమర్శించారు రోజా. ఓటుకు నోటు నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు కేంద్రం కాళ్ల దగ్గర తాకట్టు పెట్టి శరణు కోరారని ఎద్దేవా చేశారు. మాట్లాడితే తాను నిప్పు అని చెప్పే చంద్రబాబు.. 18 కేసుల్లో స్టే తెచ్చుకుని తానో తుప్పు అన్న విషయాన్ని ఇప్పటికే నిరూపించుకున్నారని విమర్శించారు.

ఏపీ రాజధానిని సింగపూర్ కు అమ్మేసే కుట్ర చేస్తున్నారని చంద్రబాబుపై ఫైర్ అయిన రోజా.. రాజధాని పేరిట గ్రాఫిక్స్ బొమ్మలను చూపిస్తూ.. అమరావతిని చంద్రబాబు భ్రమరావతిగా మార్చారని ఆరోపించారు. రాష్ట్రం నుంచి ఉన్న రాజ్యసభలో ఉన్న ఇద్దరు ఎంపీల్లో.. ఒకరు సారా.. మరొకరు బ్యాంక్ దొంగలుగా ఉండడం వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసుల నుంచి బయటపడేందుకు ఢిల్లీలో పైరవీలు చేయడమే వీరిద్దరు పనిగా పెట్టుకున్నారని, ఢిల్లీ హోదాను తాకట్టు పెట్టేశారని మండిపడ్డారు.
ప్యాకేజీ అనేది భిక్షం లాంటిది.. హోదా ప్రభుత్వోద్యోగం లాంటిది : చెవిరెడ్డి
హోదాను సాధించేవరకు విశ్రమించేది లేదని చెప్పారు చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎన్నికల సమయంలో హోదా ఇస్తామన్న టీడీపీ, బీజేపీ.. రెండున్నరేళ్లు గడిచాక దానివల్ల ఉపయోగం లేదంటూ మాట మార్చడం దుర్మార్గమన్నారు.
ప్రత్యేక హోదా అనేది ప్రభుత్వోద్యోగం లాంటిదని, ప్యాకేజీ అనేది భిక్షం లాంటిదని చెప్పారు చెవిరెడ్డి. ప్రత్యేక ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారి ఆ సునామీలో టీడీపీ బీజేపీ ద్రోహులు కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ఇదే కార్యక్రమంలో తిరుపతి ఎంపీ వరప్రసాద్ తో పాటు సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు కుమార్రెడ్డి, రామానాయుడు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అంజయ్య, కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications