పార్టీ ప్రకటిస్తేనే నిజమని భావిస్తాం -నిజమైతే పార్దివ దేహం అప్పగించండి : ఆర్కే భార్య శిరీష..!!
మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ సాకేత్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే (66) మృతి పై భార్య శిరీష స్పందించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని దక్షిణ బస్తర్ అటవీప్రాంతంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆయన బుధవారం మృతిచెందినట్టు ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు. దండకారణ్యం పరిధిలోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో రెండు రోజుల క్రితం ఆయన మరణించినట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసు వర్గాలు ధ్రువీకరిస్తుండగా.. మావోయిస్టు పార్టీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
ఖండిచిన ప్రజా సంఘాలు
ఆయన మరణించారన్న వార్తను ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాయి. 'ఆర్కే ఆనుపానులు తెలుసుకునేందుకు పోలీసులు పన్నిన కుట్ర ఇది' అని ఆరోపిస్తున్నాయి. మోకాళ్ల నొప్పులు సహా పలు అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవి మరణాన్ని కలిగించే స్థాయిలో లేవని ప్రజాసంఘాల నేతలు చెబుతున్నారు. ఆర్కే స్వస్థలం గుంటూరు జిల్లా రెంటచింతల మండలంలోని తుమృకోట. ఆయనకు భార్య కందుల నిర్మల అలియాస్ శిరీష అలియాస్ పద్మ ఉన్నారు. ఆయన కుమారుడు శివాజి అలియాస్ పృథ్వి అలియాస్ మున్నా 2016లో రామగూడ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందాడు.
నాలుగు దశాబ్దాలకు పైగా ఉద్యమంలో
మావోయిస్టు ఉద్యమంలో నాలుగు దశాబ్దాల పాటు కీలకనేతగా ఉన్న ఆర్కేపై దేశవ్యాప్తంగా 200కిపైగా కేసులున్నాయి. 2003లో అలిపిరిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై క్లెమోర్మైన్స్తో దాడి కేసు కూడా ఆయనపై ఉంది. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంతో చర్చలు జరిపిన మావోయిస్టు ప్రతినిధి బృందానికి ఆయన నేతృత్వం వహించారు. గతంలో ఎన్నోసార్లు పోలీసు కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. అయితే, ఆర్కే మృతి చెందిన విషయం పార్టీ ప్రకటించిన తర్వాతే నిజంగా భావిస్తామని భార్య శిరీష స్పష్టం చేసారు.
పార్టీ ప్రకటిస్తేనే నమ్ముతాం..పార్దివ దేహం ఇవ్వండి
ఆర్కే మృతి చెందినట్టుగా మీడియాలో వచ్చే వార్తలే చూస్తున్నామని, ఆర్కే మృతి చెందారని ఛత్తీస్ ఘడ్ డీజీపీ ప్రకటించారని... ఆయనకు ఈ సమాచారం ఎవరిచ్చారో చెప్పలేదన్నారు. ఆయన జీవితం ప్రజల కోసం ధార పోశారని, ప్రజా ఉద్యమంలో ఆర్కే ఒక యోధుడని, నిస్వార్థ విప్లవకారుడని కొనియాడారు. ఉద్యమంలో ఆయన బిడ్డను కూడా పోగొట్టుకున్నారన్నారు.
ఒకవేళ ఆర్కే మృతి నిజమైతే పార్ధీవదేహాన్ని తాము అక్కడ నుంచి తెచ్చుకునేలా సహకరించాలని ఆ ప్రభుత్వాన్ని, అక్కడి గ్రామాల ప్రజలకు ఆర్కే భార్య శిరీష విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆమె టంగుటూరు మండలం, ఆలకూరపాడులో నివాసం ఉంటున్నారు. ఇప్పటికే ఆర్కే మరణం పైన వార్త బయటకు వచ్చి చాలా సమయం గడుస్తున్నా మావోయిస్టు పార్టీ నుంచి అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు.