నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్ళొస్తూ.. ఐదుగురు హైదరాబాదీలు దుర్మరణం!!
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు ఎంతోమంది ప్రాణాలను హరిస్తున్నాయి. ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగినా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు ఉదయం నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ మండలం నల్లగుట్ట వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
ఎంతో సంతోషంగా తిరుపతి వెంకన్నను దర్శనం చేసుకుని తిరిగి వెళుతున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే ఐదుగురు మృత్యువాత పడ్డారు. మృతులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల కాలంలో మితిమీరిన వేగం, నిద్రమత్తు, నిర్లక్ష్యం వంటి కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో కూడా మితిమీరిన వేగం కారణంగానే ఇంత మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని చెబుతున్నారు. కేవలం నెలరోజుల వ్యవధిలోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాలు పదుల సంఖ్యలో ప్రాణాలు తీశాయి.
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు బీభత్సం సృష్టించగా ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ముసునూరు టోల్ ప్లాజా సమీపంలో మొదటి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టడంతో అదే సమయంలో ఎదురుగా ప్రైవేటు ట్రావెల్ బస్సు రావడంతో లారీ అదుపుతప్పి ట్రావెల్ బస్సు పైకి దూసుకెళ్ళటంతో ఏడుగురు మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు.
ఆ తర్వాత కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం ఇదే తరహాలో జరిగింది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటనా స్థలంలోనే ముగ్గురు యువకులు మృతి చెందారు. మొన్న కొత్తకోట రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పెళ్లి చూపులకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో కానరాని లోకాలకు వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications