"ఖాకీ" సినిమాలో మాదిరి ముందు రెక్కీ, తర్వాత ఘరానా దోపిడీ
తిరుపతి: పట్టణంలో పెను సంచలనం సృష్టించిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. దోపిడీకి పాల్పడిన 8 మంది నిందులను అరెస్ట్ చేసి వారివద్ద నుంచి రూ. 10 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దుండగులను మీడియా ముందు ప్రవేశపెట్టిన ఎస్సీ మహంతి.. దోపిడీ వివరాలను వెల్లడించారు.
ఎస్పీ మహంతి తెలిపిన వివరాల ప్రకారం.. దుండగులు 'ఖాకీ' సినిమా తరహాలో 15 రోజుల ముందే దోపిడీకి పక్కా స్కెచ్ వేశారు. కడప నుంచి టవేరా వాహనంలో వచ్చిన దుండగులు.. స్థానిక లాడ్జిలో బసచేశారు.
దోపిడీకి ముందు సదరు వృద్దుల ఇంట్లో పాలు సరఫరా చేసే మహిళ నాగలక్ష్మిని కలిశారు. ఆమె సహకారంతో ఒక్కొక్కరే వెళ్లి ఇంట్లో చొరబడి వృద్దులను కొట్టి కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. దోపిడీ తర్వాత బృందాలుగా విడిపోయిన దుండగులు.. వేర్వేరు మార్గాల్లో పట్టణ శివారుకు చేరుకుని వాహనంలో పారిపోయారు.
కాగా, బాధితుల ఇంటికి 50 అడుగుల దూరంలోనే నాగలక్ష్మి షాపు ఉంది. దొంగతనం ఫిర్యాదు అందుకున్న స్థానిక పోలీసులు.. క్లూస్ టీం సహకారం, టెక్నాలజీతో కేసును ఛేదించారు. ఇంటికి వచ్చే, వెళ్లేవారితో జాగ్రత్తగా ఉండాలి ఎస్పీ మహంతి ప్రజలను అప్రమత్తం చేశారు.