హంపీ ఎక్స్ప్రెస్లో దోపిడీ యత్నం: పోలీసుల కాల్పులు
అనంతపురం/గుంటూరు: అనంతపురం జిల్లా కల్లూరు వద్ద హంపీ ఎక్స్ప్రెస్ రైల్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఎస్-7, ఎస్-8 బోగీల్లో ఉన్న ప్రయాణికులను కత్తులతో బెదిరించి ఆభరణాలు, నగదు దోచుకునేందుకు విఫలయత్నం చేశారు.
వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు కాల్పులు జరపడంతో దొంగలు పరారయ్యారు. రైలు హంపీ నుంచి బెంగళూరు వెళ్తుండగా కళ్లూరు వద్ద ఈ ఘటన జరిగింది. ఇటీవల కూడా ఓ రైలులో మరణాయుధాలతో ప్రయాణికులను బెదిరింపులకు గురిచేసిన దొంగలు భారీ దోపిడీకి పాల్పడిన విషయం తెలిసిందే.
గుంటూరు జిల్లాలో దారుణం
గుంటూరు: జిల్లాలోని రేపల్లె మండలం పెనుమూడిలో దారుణం ఘటన జరిగింది. తన బైక్ ఢీకొట్టినందుకు ఓ బస్సు డ్రైవర్ను బైకర్ కొట్టిచంపినట్లు తెలిసింది. శనివారం ఉదయం స్కూల్ బస్సు - బైక్ ఢీకొన్నాయి. దీంతో బస్సు డ్రైవర్కు ద్విచక్రవాహనదారుడికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఈ ఘర్షణలో బస్సు డ్రైవర్కు గాయాలు కావడంతో మృతి చెందాడు. అయితే ఘర్షణ వల్ల బస్సు డ్రైవర్ మృతి చెందాడా లేక హార్ట్ ప్రాబ్లమ్ వల్ల మరణించాడా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
కారు బీభత్సం
హైదరాబాద్: నగరంలోని అంబర్పేటలో ఓ కారు బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం కారు జనాలపైకి దూసుకెళ్లడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.