ప్రివిలెజ్ కమిటీ భేటీకి రోజా డుమ్మా: మరోసారి కంటనీరు పెట్టిన అనిత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శానససభ ప్రివిలెజ్ కమిటీ సమావేశానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యురాలు రోజా గైర్హాజరయ్యారు. శనివారం సాయంత్రం ఈ కమిటీ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ఇతర వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, కొడాలి నాని హాజరయ్యారు.
అనారోగ్యం కారణంగా రోజా సమావేశానికి హాజరు కాలేకపోతున్నారని వైయస్సార్ కాంగ్రెసు శాసనసభా పక్షం కమిటికీ ఓ లేఖ రాసింది. తనను శాసనసభలోకి రానీయకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన రోజా అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఆమెను నిమ్స్కు తరలించారు. ఆమె బీపి, షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు తెలుస్తోంది.
రోజాపై ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు అనిత కూడా హాజరయ్యారు. తనను రోజా అవమానించిన తీరుపై ఆమె కమిటీకి వివరించినట్లు సమాచారం. కమిటీకి విషయాలు చెప్పి ఆమె కంటనీరు పెట్టుకుంటూ సమావేశం నుంచి వెళ్లిపోయారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబును, మంత్రులను అవమానించారని తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. ఇదిలావుంటే, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోజాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యె చెవిరెడ్డి భాస్కర రెడ్డి పరామర్సించారు.