డబ్బుతో సెటిల్ చేయాలని చంద్రబాబు: వనజాక్షి, రిషికేశ్వరి ఇష్యూలపై రోజా
తిరుపతి: ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి ఉదంతంపై, నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా ఆంధ్రప్రదేశ్ ముక్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు. వనజాక్షి, రిషితేశ్వరి ఘటనలను చంద్రబాబు డబ్బుతో సెటిల్ చేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఆ ఘటనలను డబ్బుతో సెటిల్ చేయాలని చంద్రబాబు చూడడం దుర్మార్గమని ఆమె అన్నారు. మంగళవారంనాడు తిరుపతిలో ఆమె యాంటి ర్యాగింగ్ పోస్టర్ను విడుదల చేశారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేదని అన్నారు. రిషితేశ్వరి ఘటనపై రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప స్పందించకపోవడాన్ని ఆమె తప్పు పట్టారు.

రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనలో నాగార్జున విశ్వవిద్యాలయం విసిని, ప్రిన్సిపాల్ను అరెస్టు చేయాలని రోజా డిమాండ్ చేశారు. రిషితేశ్వరి ఘటనపై సిట్డింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆమె కోరారు. కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టిడిపి శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్తో పాటు ఆయన అనుచరులు దాడి చేశారంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
అదే విధంగా ర్యాగింగ్ కారణంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అర్కిటెక్చర్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతోందని రోజా ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications