బొజ్జలకు మతి భ్రమించింది: రోజా, జగన్ది రౌడీ భాష: గాలి
హైదరాబాద్: అలిపిరి ఘటనతో ఆంధ్రప్రదేశ్ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డికి మతిభ్రమించిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నగరి శాసనసభ్యురాలు, సినీ నటి రోజా వ్యాఖ్యానించారు. బొజ్జలను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని రోజా డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా బాగుపడాలంటే బొజ్జలను మంత్రి పదవి నుంచి తొలగించాలని ఆమె చిత్తూరు జిల్లాలో అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఏడాది పాలనలో ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. విజయయాత్రలు చేసుకునే హక్కు చంద్రబాబుకు ఎక్కడిదని ఆయన మంగళవారం హైదరాబాదులో మీడియా సమావేశంలో ప్రశ్నించారు. ఏడాది పాలనలో ఏం చేశారో ప్రజలకు చెప్పాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆయన అన్నారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యననాయుడు ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆయన అడిగారు. టిడిపి, బిజెపిలకు ఓటు వేస్తే భవిష్యత్తు మారుస్తామని చెప్పి ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారని ఆయన అడిగారు. టిడిపి ఎన్నికల ప్రణాళిలో చెప్పిందేమిటి, ఇప్పుడు చేస్తున్నదేమిటని ఆయన అడిగారు.
ప్రతిపక్ష నేత జగన్ రౌడీ భాష మాట్లాడుతున్నాడని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ముఖ్యమంత్రిని రాళ్లతో కొట్టాలనడం ప్రతిపక్షనేత అనాల్సిన మాటలేనా? అని గాలి ప్రశ్నించారు. తాము జగన్ వ్యాఖ్యలపై కేసు పెట్టవచ్చని, కానీ ఆ పని చేయబోమని ఆయన అన్నారు. 2019 నాటికి జగన్ ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదని గాలి అన్నారు. దేశంలో తక్కువ రైతు ఆత్మహత్యలు ఏపీలోనే నమోదయ్యాయని ఆయన చెప్పారు.
చంద్రబాబుపై విమర్శలు చేసే నైతిక అర్హత జగన్కు లేదు, అర్థం లేని యాత్రలతో జగన్ పిచ్చిపనులు చేస్తున్నారని మంత్రి పీతల సుజాత ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండం కేఆర్పురంలో జరిగిన ఐటీడీఏ పాలకవర్గం సమావేశంలో ఆమె పాల్గొన్నారు. సంక్షేమ పథకాల అమలులో గిరిజనులకు అన్యాయం జరగుకుండా చూడాలని మంత్రి పీతల అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయం వద్ద మంత్రి పీతల కారును గిరిజనులు అడ్డుకున్నారు. గిరిజనులకు పోడు భూమి పట్టాలివ్వాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని సంప్రదించి సమస్యను పరిష్కరిస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.