రిషికేశ్వరి నిందితులకు ప్రభుత్వ రక్షణ, దౌర్జన్యాలు: రోజా, కౌంటర్ ఇచ్చిన పరిటాల
హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలపై దౌర్జన్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఏపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ విషయమై తెలుగుదేశం ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీయాలని రోజా కోరారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
నాగార్జున వర్శిటీలో ర్యాగింగ్ వల్ల ఆత్మహత్యకు పాల్పడిన రిషితేశ్వరితో పాటు ఒక కార్పోరేట్ కాలేజీలో అనేక మంది విద్యార్ధులు మరణించడంపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రిషితేశ్వరి కేసులో ప్రిన్సిపాల్ను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఈ కేసులో ప్రిన్సిపాల్పై కేసు నమోదు చేసేందుకు అవసరమైన సాక్ష్యాలు లభించలేదని పోలీసుశాఖ పేర్కొనడం విచిత్రంగా ఉందన్నారు.
కడపలో ఒక కాలేజీలో ఇద్దరు అమ్మాయిల ఆత్మహత్యపై ఇంతవరకు వాస్తవాలను పోలీసులు బహిర్గతం చేయలేదన్నారు. రాష్ట్రప్రభుత్వం మహిళల రక్షణకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. కృష్ణా జిల్లా ఎమ్మార్వో వనజాక్షిపై టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యం చేస్తే ఇంతవరకూ చర్యలు తీసుకోలేదన్నారు.
నేరగాళ్లను రక్షించే ప్రభుత్వం కాదిది: మంత్రి పరిటాల సునీత
నేరగాళ్లను కాపాడిల్సిన అవసరం చంద్రబాబు ప్రభుత్వానికి లేదని, మహిళా రక్షణ గురించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే ఆయేషా ఆత్మ క్షోభిస్తుందని గుర్తుంచుకోవాలని పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత వ్యాఖ్యానించారు. బయటి వ్యక్తుల ప్రవేశంతోనే నాగార్జున ఆర్కిటెక్చర్ కాలేజీ విద్యార్ధుల నుండి సమాచారం సేకరించాల్సిన పరిస్థితిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే కల్పించిందని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మాయిల రక్షణ కోసం వైసిపి పోరాడుతునే ఉంటుందని రోజూ చెబుతుంటే ఆయేషా మీరా ఆత్మ క్షోభిస్తుందని పరిటాల సునీత ఎద్దేవా చేశారు. ఆయేషాపై నేరపూరిత దాడి, అత్యాచారం, దారుణ హత్య జరిగి ఇన్నేళ్లు గడిచినా, నిందితులను శిక్షంచాలని ఆనాటి ముఖ్యమంత్రి వైయస్సార్ను ఆయేషా తల్లి వేడుకున్నా ఫలితం లేకపోయిందని అన్నారు.
300 మంది తెలుగుదేశం కార్యకర్తలను వైయస్ ప్రభుత్వం హత్యాకాండ సాగించి పొట్టన పెట్టుకుంది. హంతకుడి కంటే హంతకుడిని కాపాడిన వాడు భయంకరమైన నేరస్తుడని , దుర్మార్గుడు, శిక్షార్హుడని అన్నారు.
కళాశాల ర్యాగింగ్ కేసుల్లో విచారణలోకి రాజకీయ దురుద్ధేశ్యంతో బయటి వ్యక్తులను చొప్పిస్తున్న వైసిపి కుతంత్రమే వాస్తవాలను అడ్డుకుంటోందని ప్రభుత్వానికి ఎవరినీ రక్షించాల్సిన అగత్యం లేదని స్పష్టం చేశారు. ఇకనైనా వైసిపి శవరాజకీయాలు మానుకోవాలని, అప్పుడే ఆ పార్టీ ప్రజలకు మేలు చేసినట్టు అవుతుందని అన్నారు.