'అబ్బా! నాకు అది చేతకాదు' అనను: చిట్టా విప్పి.. బాబును ఏకేసిన రోజా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా శుక్రవారం నాడు మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి యనమల రామకృష్ణుడు, టిడిపి పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాల్ మనీ ఉదంతంపై మాట్లాడుతూ.. చంద్రబాబు ఆడవాళ్ల బతుకు నాశనం చేసిన వారిని సమర్థిస్తున్నారని, టిడిపి నేతలు రౌడీయిజం చేస్తున్నారన్నారు.
చంద్రబాబు చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకున్నారన్నారు. చంద్రబాబు కనుసన్నుల్లోనే శాసన సభ నడుస్తోందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా హుందాగా ఉంటూ కాల్ మనీ బాధితులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పాలన్నారు.
వనజాక్షిని కొట్టిన చింతమనేని ప్రభాకర్ను ముఖ్యమంత్రి వెనుకేసుకు వస్తున్నారన్నారు. అంబేడ్కర్ గురించి మాట్లాడినంత మాత్రాన చంద్రబాబు మంచోడు అయిపోడన్నారు. ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, సెక్స్ మాఫియాలతో సంబంధం ఉన్న చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు.
ఇంత జరుగుతున్నా మహిళా మంత్రులకు సిగ్గులేదా అని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు వంటి కుంభకోణాలతో చంద్రబాబు తన తల ఎక్కడ పెట్టుకుంటాడని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని చెప్పే చంద్రబాబు అదే పార్టీకి చెందిన వారిని తన పార్టీలోకి ఎలా తీసుకున్నారన్నారు. ఆ పార్టీ నుంచి వచ్చిన వారి నేతల జాబితాను ఆమె చదివారు.
కాల్ మనీ సెక్స్ రాకెట్ సూత్రధారులపై చర్యలు తీసుకోవాలన్నారు. టిడిపి నేతలు మా పేర్లు పెట్టి తిట్టినా పట్టించుకోరన్నారు. ఇది ఎన్టీఆర్ భవన్లా ఉంది తప్ప అసెంబ్లీలా కనిపించడం లేదన్నారు. తమను కార్యకర్తలు, పనివాళ్ల కంటే హీనంగా.. మైకులు ఇవ్వకుండా టిడిపి నేతలు రౌడీయిజం చేస్తున్నారన్నారు.
సైకిల్ పార్టీ సైకో పార్టీ అని ఎద్దేవా చేశారు. వారు అందర్నీ కొడతారని, చివరకి మహిళలను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి కూడా దింపుతారని ధ్వజమెత్తారు. టిడిపి మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులకు చీము నెత్తురు లేదా అన్నారు. మాకు చర్చ తర్వాతే ప్రకటన కావాలన్నారు.
చంద్రబాబు డౌన్ డౌన్, ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి, కాల్ మనీ సీఎం డౌన్ డౌన్ అని మాత్రమే తాము నినాదాలు చేశామన్నారు. కావాలంటే ఫుటేజీలు తెచ్చుకొని చూడవచ్చన్నారు. మేం వారితో కొట్లాడేందుకు వారు తమ శత్రువులు కాదన్నారు. కానీ ప్రజలకు అన్యాయం జరిగితే ప్రతిపక్ష నేతలుగా పోరాడుతామన్నారు.
మహిళలను వ్యభిచార వృత్తిలోకి దించితే చూస్తూ ఊరుకోమన్నారు. టిడిపి మహిళా నేతలు చీము, నెత్తురు లేకుండా ఉంటున్నారమేమో కానీ మేం అలా లేమన్నారు. కాల్ మనీ నిందితులను శిక్షించే వరకు తాము పోరాటం చేస్తామన్నారు. మహిళలకు అన్యాయం చేసే చంద్రబాబును వదలమన్నారు.
నాకు ఎవరితోను భయం లేదన్నారు. 'అబ్బా నాకు ఈ పదం పలకడమే చేతకాదు' అని నేను అనని రోజా టిడిపి మహిళా నేతలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. యనమల రామకృష్ణుడు చరిత్ర అందరికీ తెలుసన్నారు. రూల్స్ మార్చి ప్రజలను పక్కదారి పట్టించాలని చూస్తున్నారన్నారు.
యనమల నోరు తెరిస్తే అబద్దాలే అన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్తో కన్నీళ్లు పెట్టించారన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతామంటే మైక్ ఇవ్వని చరిత్ర చంద్రబాబుది అన్నారు. అంగన్వాడీలకు జీతాలు పెంచిన అంశంపై కూడా రోజా ప్రశ్నించారు. అంగన్వాడీల పైన ప్రభుత్వం మాట మారుస్తోందన్నారు.