మీ ఇంటి ముందు ధర్నా చేస్తా: చంద్రబాబుకు రోజా హెచ్చరిక
హైదరాబాద్: మహిళా సమస్యల పైన పోరాటు చేస్తున్నందున ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తన అనుచరుల పైన తప్పుడు కేసులు బనాయిస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజా ఆరోపించారు.
నగరి మున్సిపల్ చైర్మన్ శాంతకుమారి కుటుంబాన్ని పోలీసులు వేధిస్తున్నారని ఆమె మండిపడ్డారు. వెంటనే వేధింపులు ఆపకుంటే ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో పోలీసుల తీరు తీవ్ర ఆక్షేపనీయమన్నారు. తన పైన కూడా అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తక్షణమం తమ పైన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

విదేశీయులకు అప్పగిస్తారా?: రఘువీరా రెడ్డి
రాజధాని అమరావతి నిర్మాణ బాధ్యతలు విదేశీయులకు అప్పగించడంపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తెలుగు ప్రజలను అవమానించడమేనన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడారు.
ఓ వైపు భారతీయులు విదేశీ కార్పొరేట్ దిగ్గజాల సారథ్య బాధ్యతలను అందిపుచ్చుకుంటుంటే, రాజధాని నిర్మాణాన్ని సింగపూర్, జపాన్లకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. అసలు రాజధాని కోసం సేకరించిన భూములను ఏం చేస్తున్నారన్నారు.
ప్రజలకు తెలియకుండా ప్రభుత్వం విదేశాలతో చీకటి ఒప్పందాలు చేసుకుంటోందన్నారు. కేంద్రంలో ఏడాది పాలనలో నలుగురు బీజేపీ సీఎం, ఇద్దరు కేంద్రమంత్రులు అవినీతికి పాల్పడ్డారన్నారు. ఏపీలో సీఎం సహా మంత్రులు హోల్సేల్ నుంచి రిటైల్గా దోచుకుంటున్నారన్నారు. రాజధానిని మనమే నిర్మించుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications