రాఖీలు: రోజా నోట్లో జగన్ స్వీట్, ఫాంహౌస్లో కేసీఆర్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ మహిళా నేత, నగరి శాసన సభ్యురాలు రోజా ఆదివారం రాఖీ కట్టారు. రోజాకు జగన్ మిఠాయి తినిపించి ఆశీస్సులు అందజేశారు. హైదరాబాదులోని లోటస్ పాండ్లో రక్షాబంధన్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు మహిళలు, పిల్లలు జగన్కు రాఖీ కట్టారు.
ఫాంహౌస్లో కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన ఫాంహౌస్లో రాఖీ వేడుకలను జరుపుకున్నారు. ఈ వేడుకలకు ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కేసీఆర్ కూతురు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత తన సోదరుడు, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు రాఖీ కట్టారు.
చంద్రబాబుకు రాఖీ కట్టిన మంత్రులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు పలువురు ఏపీ మంత్రులు, సీనియర్ మహిళా నేతలు రాఖీ కట్టారు. చంద్రబాబు నివాసంలో మంత్రి పరిటాల సునీత, తెలంగాణ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి తదితరులు రాఖీ కట్టారు.
బీజేపీ కార్యాలయంలో..
బీజేపీ హైదరాబాదు కార్యాలయంలో ఆదివారం జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడుతో సహా పలువురు నేతలు పాల్గొన్నారు. పలువురు మహిళానేతలు, అంధులు వెంకయ్యకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రెండు రాష్ట్లాల్లోని తెలుగు ప్రజలకు వెంకయ్య హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రాఖీ పండుగ సౌభ్రాతృత్వానికి ప్రతిక అని, భారతీయ సంప్రదాయం, హిందూ జీవన పద్దతి అని, ఆది కాలం నుంచి మన పూర్వీకులు అందించిన వారసత్వమైనటువంటి జీవన విధానం దాంట్లో ఒకటైన ఈ రాఖీ పండుగ ముఖ్యమైదన్నారు.