రూ. 10 ఎర: రూ. 8 లక్షల చోరీ, హాస్టళ్లోకి విద్యార్థిలా..
హైదరాబాద్: పది రూపాయలు ఎరవేసి 8 లక్షల రూపాయలు చోరీ చేసిన ఘటన మంగళవారం నగరంలోని కెపిహెచ్బి పోలీస్స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కూకట్పల్లి బాలాజీనగర్లో నివసించే విష్ణువర్ధన్ రెడ్డి ట్రాన్స్ పోర్టు వ్యాపారం చేస్తుంటాడు.
మంగళవారం మధ్యాహ్నం కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న కెపిహెచ్బి సర్వీసు రోడ్డులోని ఐడిబిఐ బ్యాంకులో విష్ణువర్ధన్ రెడ్డి రూ. 8 లక్షల నగదు డ్రా చేసుకొని వచ్చి కారులో కూర్చున్నాడు.
అదే సమయంలో ఓ వ్యక్తి రూ. 10 పడిపోయిందని చెప్పగా డోర్ తీసి చూసే సమయంలో మరోవైపు నుంచి ఇంకో వ్యక్తి కారులోంచి రూ. 8 లక్షలున్న కవర్ను తీసుకొని పరారయ్యాడు. అనంతరం విష్ణువర్ధన్ కారులోకి ఎక్కి చూడగా నగదు కనిపించలేదు. చోరీ జరిగిందని గ్రహించి కెపిహెచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరో ఘటనలో విద్యార్థిలా హాస్టళ్లలో ప్రవేశించి.. చోరీలకు పాల్పడుతున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంబర్ పేట గోల్నాకకు చెందిన సయ్యద్ తబ్రెజ్(20) అలియాస్ మోయిజ్ డిగ్రీ విద్యార్థి. ఎల్బినగర్, చైతన్యపురి, సరూర్నగర్ ఠాణాల పరిధిలోని హాస్టళ్లల్లోకి విద్యార్థిలా ప్రవేశించి ల్యాప్టాప్ల చోరీలకు పాల్పడుతున్నాడు. విద్యార్థులు నిద్రిస్తున్న ఈ చోరీలకు పాల్పడుతుండేవాడు. అతని స్నేహితుడు మహ్మద్ షోయబ్ సహకారంతో సయ్యద్ను పోలీసులు ఎల్బి నగర్ చౌరస్తాలో అరెస్ట్ చేశారు. అతని దగ్గర్నుంచి రూ. 5.50 లక్షల విలువైన 16 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు.