వీడిన మిస్టరీ: తమిళనాడులో పట్టుబడ్డ రూ.570 కోట్లు ఎవరివి?
అమరావతి: తమిళనాడు శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కంటెయినర్లలో పట్టుబడిన రూ. 570 కోట్ల నగదుపై మిస్టరీ వీడింది. ఈ నగదు తమదేనని విశాఖపట్నం ఎస్బీఐ-ఎస్సీఏ బ్రాంచ్ అధికారులు చెప్పారు. అంతేకాదు తమిళనాడులోని కొయంబత్తూరు నుంచి ఈ నగదుని తెప్పిస్తున్నట్టు తెలిపారు.
నగదు కావాలని ఈ నెల 11వ తేదీన రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ను కోరామని, కోయంబత్తూరులో అందుబాటులో ఉండటంతో అక్కడి నుంచి విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు విశాఖపట్నం ఎస్బీఐ బ్యాంకు అధికారులు తెలిపారు.
రూ. 570 కోట్ల మిస్టరీ: కంటైనర్ల వెనక 3 కార్లు, వెనక్కి తిప్పి చిక్కారు వాస్తవానికి విమానంలో డబ్బు తీసుకురావాలని అనుకున్నా... కొన్ని ఇబ్బందులు ఉండటంతో ఎస్కార్ట్ సాయంతో రోడ్డు మార్గంలో నగదు తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలిపారు. నగదుని తరలించేందుకు విశాఖపట్నం నుంచే ఎస్కార్ట్ను పంపించామని కూడా చెప్పారు.
ఈ నగదుకి సంబంధించి తమిళనాడు పోలీసులకు పూర్తి ఆధారాలను ఇచ్చామని బ్యాంక్ అధికారులు వెల్లడించారు. దీనిపై తమిళనాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్తో కూడా మాట్లాడామని అన్నారు. కాగా, తమిళనాడులోని తిరువూరు జిల్లా పెనమనలూరు-కునత్తూరు బైపాస్ రోడ్డులో శనివారం ఎన్నికల అధికారులు తనిఖీ చేస్తుండగా మూడు కంటెయినర్లలో రూ. 570 కోట్లు దొరికిన సంగతి తెలిసిందే.
నగదు పట్టుబడిన సమయంలో ఈ మూడు కంటైనర్లను వెనక నుంచి మూడు కార్లు కూడా అనుసరిస్తున్నట్లు ఎన్నికల అధికారులు గుర్తించారు. పోలీసులు ఆపగానే కంటైనర్లను ఆపేసి కార్లను వెనక్కి తిప్పి పారిపోయే ప్రయత్నాలు చేయడంతో పలు అనుమానాలకు తావిచ్చింది.
దీంతో ఆ మూడు కార్లను పోలీసులు వెంటాడి చెంగపల్లి సమీపంలో పట్టుకున్నారు. కార్లలో ఉన్న వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. తాము ఆంధ్రప్రదేశ్ పోలీసులమని వారు చెప్పారు. యూనిఫామ్ వేసుకోలేదని అడిగితే సమాధానం చెప్పలేదని శనివారం మీడియాలో వార్తలు వచ్చాయి. ఐడి కార్డులు చూపించడంలో కూడా వారు విఫలమయ్యారు.
దీంతో వారిని పోలీసులు కలెక్టర్, ఎస్పీ ఎదుట ప్రవేశపెట్టారు. అక్కడ కూడా ఏ మాత్రం పొంతన లేని సమాధానాలు చెప్పారు. పట్టుబడిన నగదు విశాఖపట్నానికి చెందిన ఎస్బీఐ బ్యాంకుదని చెప్పారు. దీంతో ఎస్బీఐ లేదా ఆర్బీఐ నుంచి తమకు తగిన వివరాలతో కూడిన లేఖలు వస్తేనే నగదును వదులుతామని అధికారులు చెప్పారు.
ఈ క్రమంలో విశాఖపట్నానికి చెందిన ఎస్బీఐ రూ. 570 కోట్లకు సంబంధించిన పూర్తి ఆధారాలను తమిళనాడు పోలీసులతో పాటు ఎన్నికల కమిషనర్కు పంపడంతో ఈ 570 కోట్ల నగదు వ్యవహారం మిస్టరీ వీడింది.