చర్చలు విఫలం: అర్థరాత్రి నుంచి తెలంగాణ, ఎపిల్లో బస్సులకు బ్రేక్లు
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆర్టీసి బస్సులకు మంగళవారం అర్థరాత్రి నుంచి బ్రేకులు పడనున్నాయి. ఇరు రాష్ట్రాల్లోనూ ఆర్టీసి కార్మికులు సమ్మెకు దిగనున్నారు. ఆర్టీసి యాజమాన్యంతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలం కావడంతో వారు సమ్మెకు దిగుతామని తేల్చిచెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు కూడా 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలన్న కార్మికుల వాదనను యాజమాన్యం తోసిపుచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫిట్మెంట్ ఇవ్వలేమని యాజమాన్యం తేల్చిచెప్పింది. తమ సమస్యలు పరిష్కరించనందున సమ్మెకు ఆర్టీసీ కార్మికులు సిద్ధమవుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మంత్రి యనమలరామకృష్ణుడు, కార్మిక శాఖ, రవాణాశాఖ మంత్రులతో సబ్కమిటీని వేసింది.
జూలై వరకు సమ్మెను వాయిదా వేయాలని ప్రభుత్వం యాజమాన్యానికి తెలుపగా ఆదే విషయాన్ని ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు తెలియజేసింది. ఇందుకు కార్మిక సంఘాలు అంగీకరించలేదు.
కాగా, తెలంగాణ ప్రభుత్వం కార్మికులను ఎలాంటి హామీ ఇవ్వనందున వారు కూడా సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కమిటీ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తూ కార్మికులను గందరగోళ పరిస్థితి నెట్టేస్తోందని వారు ఆరోపించారు.
తమ సమస్యలపై యాజమాన్యం సానుకూలంగా స్పందించలేదని తప్పని పరిస్థితుల్లోనే సమ్మెకు దిగుతున్నామని కార్మికసంఘాలు స్పష్టం చేశాయి. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర రవాణా మంత్రి మహేందర్రెడ్డితో ఆర్టీసీ ఎండీ సమావేశమయ్యారు.