టిడిపిలోకి భూమా-అఖిల, రంగంలోకి జగన్: 'ఎవరితో మాట్లాడలేదు'
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై వైసిపి అధినేత జగన్ స్పందించినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిల ప్రియ టిడిపిలోకి వెళ్తారనే ప్రచారం రాగానే వైసిపి అధిష్టానం ఆయనతో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భూమా నాగిరెడ్డి శుక్రవారం మధ్యాహ్నం విలేకరులతో టిడిపిలో చేరుతున్నట్లుగా వచ్చిన వార్తల పైన స్పందించారని తెలుస్తోంది.
అయితే, ఆయన స్పందనలోను పూర్తి స్పష్టత లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. భూమా మాట్లాడుతూ.. తాను తన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయలేదని ఆయన చెప్పారు. అలాగే, తన వారితో తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపై మాట్లాడలేదన్నారు.
తాను అసలు ఏ కార్యకర్తల సమావేశాన్నీ నిర్వహించలేదని, ఎవరితోనూ మాట్లాడటం కానీ, చర్చలు జరపడం కానీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. మీడియాలో వచ్చిన వార్తలు ఊహాగానాలేనన్నారు. పార్టీ మారాలనుకుంటే, తాను ధైర్యంగా వెల్లడించగలనన్నారు.