వైఎస్ షర్మిలపై రూమర్స్: జగన్కు అండగా ఉన్నందుకే!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు షర్మిలకు టాలీవుడ్ హీరో ప్రభాస్తో సంబంధాలు ఉన్నాయనే ప్రచారం వెనుక కుట్ర ఉందని ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు అనుమానిస్తున్నారట. ప్రజాధరణతో ఎదుగుతున్న వారిని కించపర్చేందుకు ఇలా చేయడం సరికాదని సామాజిక వెబ్ సైట్లలోను స్పందిస్తున్నారు.
షర్మిలపై వస్తున్న ప్రచారాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. సామాజిక వెబ్ సైట్లలో అభిమానులు పెద్ద ఎత్తున దీనిపై స్పందిస్తున్నారు. కుట్ర దాగి ఉందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట.
తన సోదరుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడినందుకే షర్మిల పైన ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కాగా, షర్మిల కూడా ఈ ప్రచారాన్ని ఖండించడమే కాకుండా ఫిర్యాదు చేసిన విషయం కూడా తెలిసిందే. తాను ఎప్పుడు ప్రభాస్ను చూడలేదని, మాట్లాడలేదని, కలువలేదని ఆమె స్పష్టం చేశారు. సోషల్ నెట్ వర్క్ వెబ్సైట్లలో, పలు వెబ్సైట్లలో తనపై హీనాతిహీనమైన రీతిలో సాగుతున్న దుష్ప్రచారాన్ని తక్షణం అరికట్టాలని, అలా చేస్తున్న పిరికిపందల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని షర్మిల పోలీసులను కోరారు.