జగన్ బెయిల్ రద్దవుతుందా ? ఢిల్లీ సర్కిల్స్లో ఊహాగానాలు- జూలై 1పై సర్వత్రా ఉత్కంఠ
అక్రమాస్తుల కేసులో గతంలో ఏపీ సీఎం వైఎస్ జగన్కు హైదరాబాద్ సీబీఐ కోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ చర్చనీయాంశమవుతోంది. ఈ పిటిషన్లో ప్రస్తావనకు వస్తున్న అంశాలు, పిటిషన్ తీవ్రత ఆధారంగా దీనిపై ఓ నిర్ణయమైనా వెలువడవచ్చన్న చర్చ ఢిల్లీ పొలిటికల్ సర్కిళ్లలో సాగుతోంది. సీఎం జగన్ రాజకీయ భవిష్యత్తుకు కీలకంగా మారిన ఈ పిటిషన్పై జూలై 1న తదుపరి విచారణలో సీబీఐ కోర్టు ప్రకటించే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
జగన్ బెయిల్ రద్దు పిటిషన్
ఏడేళ్ల క్రితం అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్కు హైదరాబాద్ సీబీఐ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి ఆయన బెయిల్పై ఉంటూనే తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. తాజాగా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు జగన్కు అప్పట్లో ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. బెయిల్ షరతుల్ని జగన్ ఎలా ఉల్లంఘించారో తన పిటిషన్లో సవివరంగా ప్రస్తావించారు. దీనిపై జగన్ కౌంటర్ దాఖలు చేయగా.. దానిపైనా వివరణ ఇస్తూ మరిన్ని వివరాలను కోర్టు ముందు ఉంచారు. దీనిపై జూలై 1న తదుపరి విచారణ జరగాల్సి ఉంది.
జగన్ బెయిల్ రద్దు కానుందా ?
జూలై 1న జరిగే విచారణలో కానీ ఆ తర్వాత కానీ సీబీఐ కోర్టు జగన్ బెయిల్ రద్దుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జగన్ బెయిల్ రద్దు కోరుతూ రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్లో అంశాల తీవ్రత ఆధారంగా దీనిపై నిర్ణయం వెలువడాల్సి ఉంది అయితే సీబీఐ చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని సీబీఐ కోర్టును ఇప్పటికే కోరింది. దీంతో సీబీఐ వాదనకు ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇక మిగిలింది రఘరామరాజు వర్సెస్ జగన్. రఘురామరాజు పిటిషన్పై జగన్ కౌంటర్ ఇవ్వగా..దానికి రఘురామ తిరిగి రీజాయిండర్ ఇచ్చారు. బెయిల్ షరతుల ఉల్లంఘనే ప్రధానంగా ఇది సాగింది. దీంతో జగన్ బెయిల్ రద్దుకు తగినన్ని కారణాలు ఉన్నాయన్న వాదన తెరపైకి వస్తోంది. అంతిమంగా బెయిల్ రద్దుకు ఇది కారణమవుతుందా అన్న చర్చ సాగుతోంది.
ఢిల్లీ పొలిటికల్ సర్కిళ్లలో చర్చ
వైఎస్ జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ ఇప్పుడు లోక్సభలో నాలుగో అతిపెద్ద పార్టీ కాగా.. రాజ్యసభలో ఆరో అతిపెద్ద పార్టీ.. వచ్చే ఏడాది రాజ్యసభ ఎన్నికలు కూడా పూర్తయితే రాజ్యసభలోనూ నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించబోతోంది. అటు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో జగన్ సత్సంబంధాలు నెరుపుతున్నారు. అదే సమయంలో రఘురామరాజు వేసిన బెయిల్ రద్దు పిటిషన్ ఢిల్లీ పొలిటికల్ సర్కిళ్లలో దీనిపై ఆసక్తి పెంచింది. ఆ తర్వాత రఘురామపై సీఐడీ రాజద్రోహం కేసులు పెట్టడంతో ఆ ఫోకస్ మరింత పెరిగింది. తన బెయిల్ రద్దు కోసం పిటిషన్ వేసిన రెబెల్ ఎంపీని జగన్ లక్ష్యంగా చేసుకున్న ప్రచారం జాతీయ స్ధాయిలో సాగింది. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చాక రఘురామ జగన్ బెయిల్ రద్దు కేసులో ఓవైపు కోర్టుకు ఆధారాలు ఇస్తూనే, మరోవైపు ఎంపీలు, సీఎంలు, గవర్నర్లకు లేఖలు రాయడంతో ఈ హీట్ మరింత పెరిగింది. అంతిమంగా జగన్ బెయిల్ విషయంలో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ ఢిల్లీలోనూ నెలకొంది.
జూలై 1న తేలిపోతుందా ?
వైఎస్ జగన్ బెయిల్ రద్దు కోరుతూ రఘురామరాజు వేసిన పిటిషన్పై ఇప్పటివరకూ పూర్తిస్దాయిలో విచారణ జరగలేదు. రఘురామ పిటిషన్పై జగన్ కౌంటర్ దాఖలు చేయగా.. దీనికి తిరిగి రఘురామ రీజాయిండర్ ఇచ్చారు. విచారణ జరిగే సమయానికి జగన్ తరఫు న్యాయవాది సమయం కావాలని కోరారు. దీంతో జూలై 1న జరిగే విచారణలో జగన్ తరఫు న్యాయవాదులు మరో కౌంటర్ దాఖలు చేయబోతున్నారు. దీనిపై ఎలాగో సీబీఐ గతంలోనే మెమో ఇచ్చినందున, వీరిద్దరి కౌంటర్ల ఆధారంగా సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎలాగో ఈ కేసుల్ని విచారిస్తోంది అదే కోర్టు కాబట్టి బెయిల్ రద్దుపై కీలక నిర్ణయం త్వరగానే వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో జూలై 1న కోర్టు ఏం చెప్పబోతోందన్నది కీలకంగా మారింది.