‘రుణమాఫీ’ అధికారుల నిర్బంధం... రూ. 17 కోట్ల మేర అవకతవకలు, ఉద్రిక్తత
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీపై నిన్నటిదాకా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తే, తాజాగా బాధిత రైతులు పథకంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
రుణమాఫీ పత్రాలను అందజేసేందుకు వచ్చిన అధికారులను రైతులు నిర్బంధించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో రుణమాఫీకి చాలా మంది రైతులకు అర్హత ఉన్నా, అధికారులు కేవలం ఇద్దరు రైతులకు మాత్రమే రుణమాఫీ పత్రాలను అందజేశారు. దీంతో, నిరసన వ్యక్తం చేసిన గ్రామ రైతులు అధికారులను నిర్బంధించారు.
రూ. 17 కోట్ల మేర అవకతవకలు.. ఉద్రిక్తత
విజయనగరం జిల్లా గురుబిల్లి మండలం రావివలసలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రావివలస పీఏసీపీఎస్లో బినామీల పేరుతో రూ. 17 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో రైతులు ఆందోళనకు దిగారు.
సహకార సంఘం ఎదురుగా ఉన్న వసతి గృహంలో దాక్కున్న సీఈఓ సింహాచలంను రైతులు బయటకు తీసుకొచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను అడ్డుకోవడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది.