రైల్వే ట్రాక్ పై ఇనుపరాడ్ కట్టిన దుండగులు-శబరి ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం
ఏపీలోని గుంటూరులో ఇవాళ ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. శబరి ఎక్స్ ప్రెస్ ఉదయం గుంటూరుకు వచ్చే ముందు నగరంలోని కంకరగుంట రైల్వే గేట్ వద్ద ట్రాక్ పై ఓ ఇనుపరాడ్డు అడ్డంగా కట్టిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. సకాలంలో దాన్ని తొలగించడంలో పెను ప్రమాదం తప్పింది.
గుంటూరులోని కంకరగుంట గేటు సమీపంలో రైల్వేట్రాక్ పై అగంతకులు అడ్డంగా ఇనుప రాడ్డును కట్టారు. ఈ రాడ్ ను శబరి ఎక్స్ ప్రెస్ ఢీకొని ఉంటే పెను ప్రమాదం జరిగేది. కానీ సకాలంలో రైల్వే సిబ్బంది ఈ ఇనుపరాడ్డును గుర్తించి తొలగించారు. రాడ్డును ముందుగా గుర్తించి రైలును నిలిపి వేసి రాడ్డును తొలగించారు. దీంతో రైలు అక్కడ నుంచి సురక్షితంగా బయలుదేరి వెళ్లింది. ప్రయాణికులు కూడా ఊపిరిపీల్చుకున్నారు.

అయితే రైల్వే ట్రాక్ కు అడ్డంగా ఇనుపరాడ్డును కట్టిన ఘటనపై రైల్వే పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ పని ఎవరు చేసి ఉంటారనేది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. రైల్వే ట్రాక్ సమీపంలో కదలికల్ని సీసీటీవీల ద్వారా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదుచేశారు.

రైల్వే చట్టంలోని సెక్షన్ 154, 174సి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. రైల్వే గేటు సమీపంలో ప్రత్యక్ష సాక్ష్యులను ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications