కిరణ్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ: తాజాగా సబ్బం హరి
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెసు పార్టీకి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించిన కిరణ్ కుమార్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. పార్టీ పెడితే వెంట ఉంటామని హామీ ఇచ్చిన కాంగ్రసులోని సీమాంధ్ర నాయకులు పలువురు ఆదిలోనే తప్పుకోగా, ఎన్నికలు వచ్చిన తర్వాత మరి కొంత మంది తప్పుకుంటున్నారు. తాజాగా, విశాఖపట్నం లోకసభ అభ్యర్థి సబ్బం హరి నిర్ణయం కిరణ్ కుమార్ రెడ్డిని కోలుకోని దెబ్బ తీసింది.
సబ్బం హరి విశాఖపట్నం బరి నుంచి తప్పుకుంటున్నట్లు మాట మాత్రంగానైనా కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పకుండా ప్రకటించారు. మంగళవారంనాడు గుంటూరు జిల్లాలోని నలుగురు శాసనసభ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ పెట్టడానికి ముందు తనతో ఉన్న రాయపాటి సాంబశివ రావు తెలుగుదేశం పార్టీలో చేరిపోయి, తన పార్టీవారిని కూడా లాక్కోవడం కిరణ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవమే.
కాగా, సమైక్యాంధ్ర నినాదాన్ని గట్టిగా వినిపిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి వెంట ఉంటారని భావించిన మాజీ మంత్రులు శైలజానాథ్, పార్థసారథి వంటివారు యూటర్న్ తీసుకున్నారు. పార్థసారథి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిపోయారు. శైలజానాథ్ తెలుగుదేశం పార్టీ టికెట్ నుంచి శాసనసభకు పోటీ చేయడానికి ప్రయత్నించి విఫలమై, తిరిగి కాంగ్రెసు అభ్యర్థిగానే పోటీలో ఉన్నారు.
నిజానికి, కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా పోటీలో ఉండకపోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బ. ఆయన పీలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయకుండా తన సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డిని పోటీకి దింపారు. సబ్బం హరి పోటీ నుంచి తప్పుకోవడమే కాకుండా బిజెపికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై అమలాపురం జై సమైక్యాంధ్ర పార్టీ లోకసభ అభ్యర్థి హర్షకుమార్ గుర్రుమన్నారు.