Bhola Shankar టికెట్ రేట్ల పెంపుపై సజ్జల ఏం చెప్పారంటే..!!
అమరావతి: తెలుగుదేశం- జనసేన పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్పై వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటు విమర్శలు చేశారు. అన్నమయ్య రాయచోటి జిల్లాలోని పుంగనూరులో ఇటీవల సంభవించిన ఘటనలకు చంద్రబాబే బాధ్యుడని, పవన్ కల్యాణ్ ఆయనను వెనకేసుకొస్తోన్నాడంటూ ఆరోపించారు. మెగాస్టార్ చిరంజీవికీ చురకలు అంటించారు.
తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదనే ఉద్దేశంతో చంద్రబాబు ఉద్దేశపూరకంగా పుంగనూరులో అల్లర్లకు పాల్పడ్డారని సజ్జల స్పష్టం చేశారు. దీనిపై ఆయన సాక్ష్యాధారాలతో సహా దొరికారని గుర్తు చేశారు. తన కార్యకర్తలను రెచ్చగొడుతూ చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని రాష్ట్ర ప్రజలందరూ చూశారని పేర్కొన్నారు.

అదే సమయంలో చిరంజీవి నటించిన భోళా శంకర్ టికెట్ల రేట్లపైనా సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. చంద్రబాబు హయాంలో బాలకృష్ణకు ఒక న్యాయం.. మిగిలిన వారికి ఒక న్యాయం అన్నట్లు తాము ఎప్పుడూ చేయలేదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలోనూ వివిక్ష చూపట్లేదని పేర్కొన్నారు.
సినిమాల్లో కూడా బడ్జెట్ లింక్డ్ టికెటింగ్ వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని సజ్జల అన్నారు. ఎవరైనా సరే ఆధారాలు చూపించి టికెట్ ధరలు పెంచుకోవచ్చునని చెప్పారు. బడ్జెట్ ఆధారంగా టిక్కెట్ల ధరను నిర్ణయిస్తారని, అది పారదర్శకతలో భాగంగా తీసుకున్న విధానపరమైన నిర్ణయమని అన్నారు.
ఏ సినిమా అయినా దాని నిర్మాణ వ్యయం 100 కోట్ల రూపాయల బడ్జెట్ను దాటితే, అందుకు సంబంధించిన పత్రాలను సమర్పించి టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి తీసుకోవచ్చని సజ్జల స్పష్టం చేశారు. పారదర్శక వ్యవస్థ అమలు చేస్తోన్న వైఎస్ జగన్ను ఇదే చిరంజీవి గతంలో ప్రశంసించారని అన్నారు.

అన్నీ పద్దతి ప్రకారం జరగాల్సిఉన్నప్పుడు చిరంజీవి మాట్లాడటంలో అంతర్యం ఏమిటో తనకు అర్ధం కావట్లేదని చెప్పారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడినట్లు కనిపిస్తోందని అన్నారు. అలా మాట్లాడటం ద్వారా ఎవరి ప్రయోజనాలు కాపాడాలనుకున్నాడో చిరంజీవికే తెలియాలని సజ్జల వ్యాఖ్యానించారు.
చిరంజీవి కేంద్రమంత్రిగా పని చేశారని, ప్రభుత్వానికి ఒక పాలసీ ఉంటుందనే విషయం ఆయనకూ తెలుసునని, అలాంటప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో అర్థం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా గురించి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడ లేదని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications