కేంద్రం చేస్తే ఒప్పు.. ఏపీ చేస్తే తప్పా?: బీజేపీ, చంద్రబాబును ఏకిపారేసిన సజ్జల, ‘అమర్రాజా’పై ఇలా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేస్తోందని, రుణాంధ్రప్రదేశ్గా మార్చిందంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్తిక ఇబ్బందులు ఉన్నాయనేది అందరికీ తెలిసునని ఆయన అన్నారు. మంగళవారం సజ్జల మీడియాతో మాట్లాడారు.

కేంద్రం అప్పులు చేయడం లేదా?.. ఏపీ చేస్తే తప్పా..
కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాలూ ఆర్థిక కష్టాలు, సంక్షోభంలో ఉన్నాయని సజ్జల అన్నారు. సంక్షేమ పథకాలకు వెచ్చించడం వల్ల ఆర్థిక సమస్యలు ఎక్కువ అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ సంక్షోభం విషయం ఉద్యోగులకు తెలుసునని, అందుకే వారు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాల అములుకు కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయడం లేదా అనేది బీజేపీ నేతలు చెప్పాలన్నారు. బీజేపీ నేతలు విమర్శలు వారి దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. బీజేపీ వాల్లు అప్పు చేయడం ఒప్పు.. తాము చేయం తప్పా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకొచ్చే ప్రతి పైసాను సద్వినియోగం చేస్తున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.

చంద్రబాబు వల్లే ఏపీకి ఈ పరిస్థితి.
ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు టీడీపీకి లేదన్నారు సజ్జల. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రూ. 3 లక్షల కోట్ల అప్పులకు కరోనా సంక్షోభం తోడైందని తెలిపారు. చంద్రబాబు నిర్వాకంతోనే పెట్రోల్ ధరలు పెరిగాయన్నారు. 2015లోనే చంద్రబాబు పెట్రోల్, డీజిల్పై రూ. 4 అదనంగా పెంచారని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలపై టీడీపీ విమర్శలు హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు హయంలోనే ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయన్నారు. చంద్రబాబు హయాంలో ధరలు పెరిగినప్పుడు ఎల్లో మీడియా ఏం చేసిందని ప్రశ్నించారు. చంద్రబాబు అడ్డంగా దోచుకోవడం వల్లే ఏపీకి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. రెవెన్యూ తగ్గినా సీఎం జగన్ ప్రజలపై భారం మోపలేదన్నారు.

అమర్రాజా కంపెనీ వ్యవహారంపై సజ్జల
అమర్రాజా కంపెనీ వ్యవహారంపైనా సజ్జల స్పందించారు. అమర్రాజా కంపెనీ విషపూరితమైన కాలుష్యం వెదజల్లుతోందని, ప్రజల ఆరోగ్యం కంటే ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదని సజ్జల స్పష్టం చేశారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని కోర్టు హెచ్చరించిందని చెప్పారు. అమర్రాజా వ్యవహారంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు. ప్రజలకు హాని కలిగించని పరిశ్రమలు ఉండాలన్నదే సీఎం ఉద్దేశమని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే అన్ని పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, అమర్రాజా కంపెనీ ఏపీ నుంచి చెన్నైకి తరలిపోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications