వైఎస్ జగన్-చంద్రబాబు మధ్య తేడా ఇదీ..!!
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఆయన.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- చంద్రబాబు మధ్య గల తేడాను వివరించారు.
తన ప్రభుత్వ హయాంలో చంద్రబాబు వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వాటన్నింటికీ జీవం పోశారని పేర్కొన్నారు. ఒక వర్గం, ఒక ప్రాంతం, కొంతమంది కోసమే చంద్రబాబు పరిపాలన సాగిస్తే- రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం జగన్ పని చేస్తోన్నారని అన్నారు.

వైఎస్ఆర్సీపీకి చెందిన విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస రావు పుట్టిన రోజు వేడుకల్లో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన ప్రసంగించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు వలంటీర్లపై ఇష్టానుసారం మాట్లాడుతుండటం వారిద్దరి వైఖరికి అద్దంపడుతోందని విమర్శించారు.
కరోనా సమయంలో వలంటీర్లు.. ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించారనే విషయాన్ని మరిచిపోయినట్టున్నారని ఎద్దేవా చేశారు. కరోనా కాలంలో చంద్రబాబు, పవన్ ఎక్కడికి పారిపోయారని నిలదీశారు. కరోనా సమయంలో ప్రజలకు సేవలను అందించే విషయంలో మన రాష్ట్రం అత్యుత్తమంగా నిలిచిందని సజ్జల గుర్తు చేశారు.
ఇళ్లల్లో నుంచి బయటకు రావడానికే భయపడిపోయిన కరోనా సంక్షోభంలో వలంటీర్లు ప్రతి గడపకూ వెళ్లి, తమ ఇంటి కుటుంబ సభ్యుడిగా ప్రతి ఒక్కరినీ పలకరించారని, వారి యోగక్షేమాలను తెలుసుకున్నారని సజ్జల గుర్తు చేశారు. కరోనా బారిన పడిన వారికి ఎలాంటి చికిత్సను అందించాలనే విషయాలను తెలుసుకుని వైద్య సేవలు అందించడాన్ని ప్రజలు ఎవరూ మరిచిపోరని అన్నారు.

పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడానికి వికేంద్రీకరణ ఒక్కటే మార్గమని తమ ప్రభుత్వం భావించిందని, అందుకే 26 జిల్లాలను ఏర్పాటుచేసిందని అన్నారు. గ్రామ సచివాలయాల వ్యవస్థను తీసుకు రావడం ద్వారా వైఎస్ జగన్ 1,30,000 మందికి ఉద్యోగాలను కల్పించారని చెప్పారు.
ఎలాంటి అవకతవకలకు అవకాశమే లేకుండా ప్రతిభ ఆధారంగా గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఉద్యోగాలను కల్పించారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెద్ద ఎత్తున ఉపాధి ఇచ్చారని సజ్జల చెప్పారు. వారికి అనుబంధంగా 2.60 లక్షల మందితో కూడిన వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. వలంటీర్ల ద్వారా పధకాలన్నీంటిని ఇంటింటికి తీసుకువెళ్తున్నారని అన్నారు.
జగనన్న సురక్ష కార్యక్రమంలో 97 లక్షల పెండింగ్ ఆర్జిలను పరిష్కరించామని సజ్జల అన్నారు. అందులో వివిధ రకాల 47 లక్షల సర్టిఫికేట్లు జారీ చేశారని చెప్పారు. ఇంతకు ముందు ఇలాంటివన్నీ పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్లో ఉండటం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే వారని వ్యాఖ్యానించారు. జగనన్న సురక్షా కార్యక్రమం వైఎస్ జగన్ ఆలోచనలలో నుంచి పుట్టిన వినూత్న కార్యక్రమం అని అన్నారు.












Click it and Unblock the Notifications