బాలకృష్ణ వియ్యంకుడ్ని లాగారు..!: 'ముద్రగడ లేఖ వెనుక జగన్'
విజయవాడ: నవ్యాంధ్ర రాజధాన అమరావతిలో సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, మంత్రులు, ఎంపీ మురళీ మోహన్ భూదందా చేశారని వైసిపి అధినేత జగన్ పత్రిక సాక్షిలో కథనం వచ్చింది. దీనిపై టిడిపి నేతలు భగ్గుమంటున్నారు. మరోవైపు, సాక్షి కథనం ఆధారంగా వైసిపి, కాంగ్రెస్ పార్టీలు బాబును టార్గెట్ చేశాయి.
ఈ వివాదంలోకి హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ వియ్యంకుడిని కూడా లాగారు. మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పి నారాయణలు తమ పైన వచ్చిన ఆరోపణలను ఖండించారు. తమకు రాజధాని పరిధిలో భూములు ఉన్నట్లు నిరూపిస్తే తాము వాటిని రాసిస్తామని సవాల్ చేశారు.
ఈ సందర్భంగా మీడియా ప్రశ్నలకు మంత్రులు నీళ్లు నమిలారని సాక్షి మీడియా పేర్కొంది. ఇప్పుడు చంద్రబాబు ఉంటున్న నివాసం అక్రమం కాదా? అని మీడియా ప్రశ్నించగా.. దానికి అది తాత్కాలికమేనని చెప్పారు. లింగమనేని ఎస్టేట్ను పూలింగ్ పరిధి నుంచి ఎందుకు తప్పించారని మీడియా ప్రశ్నించింది.
అదే సమయంలో బాలకృష్ణ వియ్యంకుడికి అన్ని ఎకరాలు ఎందుకు ఇచ్చారని, ఆ తర్వాత అలైన్మెంట్ ఎందుకు మార్చారని మీడియా ప్రశ్నించింది. ఒక్కరి కోసం అలైన్మెంట్ మారదని వారు సమాధానం చెప్పారు. అసైన్డ్ భూముల పరిహారానికి అంత సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించగా... ఆధ్యయనం చేయడం వల్ల ఆలస్యమైందని చెప్పారు.
ముద్రగడ లేఖ వెనుక జగన్ పాత్ర: నారాయణ
కాపు నేత ముద్రగడ పద్మనాభం లేఖ వెనుక వైసిపి అధినేత జగన్ పాత్ర ఉందని మంత్రి నారాయణ వెల్లడించారు. కాపులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. కాపు కార్పోరేషన్ ద్వారా రూ.192 కోట్లు రుణాలు ఇచ్చామని చెప్పారు.
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా ఇంకా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారన్నారు. ముఖ్యమంత్రి చెబితే మోసపూరిత హామీలు అంటారా అని ప్రశ్నించారు. కాపులకు సబ్ ప్లాన్ వర్తింప చేస్తామంటే మోసపూరితం అనడం విడ్డూరమన్నారు. సీఎంకు లేఖ రాసేటప్పుడు జాగ్రత్తగా రాయాలని సూచించారు.