రోజురోజుకూ రాటుదేలుతున్న సంచయిత.. బాబాయ్ పై ప్రతీకారమే లక్ష్యంగా జేజమ్మ అడుగులు.....
గతేడాది ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు విజయనగరంలోని చారిత్రక మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ గా అర్ధరాత్రి జీవోలతో బీజేపీ యువ నేత సంచైత గజపతిరాజును నియమించడం సహజంగానే ఎవరికీ రుచించలేదు. మాన్సాస్ పదవిలో సంచైతను ఎలా కూర్చోబెడతారని, ఆమె అనుభవం ఏంటని, పూసపాటి వంశంలో వారసులే లేరా అని అంతా ప్రశ్నించారు. కానీ తాజాగా సంచైత దూకుడు చూస్తుంటే ఆ ఆరోపణలన్నీ ఆపోహలే అని తేలిపోతున్నాయి..
ఏపీ ప్రతిపక్షాలకు ఆయుధాలిస్తున్న వైసీపీ నేతలు .. జగన్ కు తలనొప్పిగా ఎమ్మెల్యేలు,ఎంపీల వ్యాఖ్యలు
అనుకున్నదొకటి.. అవుతుందొకటి...
మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ గా సంచైత గజపతిరాజును వైసీపీ సర్కారు రాత్రికి రాత్రే నియమించడం మింగుడు పడని టీడీపీ, బీజేపీ నేతలు.. ఆమె బాబాయ్ అశోక్ గజపతిరాజును అడ్డంపెట్టి రాజకీయాలకు తెరలేపారు. ఆమెను మాన్సాస్ ను పరిపాలించేంత అనుభవం లేదని, ఆమెను అడ్డంపెట్టుకుని మాన్సాస్ భూముల్ని వైసీపీ నేతలు కొట్టేయాలని చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. మాన్సాస్ లో ఏం జరిగినా సంచైతను బాధ్యురాలిగా చేసి ఆమెను తప్పించేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. కానీ సంచైత వీటికి అస్సలు లొంగేలా కనిపించడం లేదు. మాన్సాస్ భూములపై, ఇతర ఆస్తులపై టీడీపీ, బీజేపీ నేతలు, బాబాయ్ అశోక్ చేస్తున్న ఆరోపణలకు ఆమె ఇస్తున్న కౌంటర్లు చూస్తుంటే వీరికి మతిపోతుందంటే అతిశయోక్తి కాదు.
సంచైత దూకుడు... బాబాయ్ టార్గెట్ గా...
మాన్సాస్ ఆస్తుల పరిరక్షణ సంచైతకు చేతకావడం లేదంటూ బాబాయ్, టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి తాజాగా చేసిన ఆరోపణలకు ఆమె ఇచ్చిన కౌంటర్లు చూస్తే సంచయిత ఏ స్ధాయిలో అక్కడి రాజకీయాన్ని వంటబట్టించుకుందో అర్ధమవుతుంది. విజయనగరంలో తమ వారసత్వ సంపద అయిన మూడు లాంతర్ల కూడలిని వైసీపీ సర్కారు కూల్చేస్తుంటే సంచైత మౌనంగా ఉందంటూ అశోక్ చేసిన ఆరోపణలకు మోతీమోహల్ కూలుతుంటే ఎక్కడున్నారంటూ ఆమె వేసిన ప్రశ్న పెద్దాయనకు అస్సలు మింగుడుపడలేదు. అలాగే ట్రస్టు భూములపై బాబాయ్ చేసిన ఆరోపణలకు ఇచ్చిన కౌంటర్ కూడా అలాంటిదే. అప్పట్లో ట్రస్టు భూముల పరిరక్షణకు కనీసం లాయర్ ను కూడా నియమించని విషయాన్ని సంచైత గుర్తు చేయగానే బాబాయ్ కు ఎక్కడో గుచ్చుకుంది. మాన్సాస్ క్యాంపస్ ను ఐఎల్ఎఫ్ఎస్ కు ఇచ్చేసి విద్యార్ధులను షెడ్లలోకి మార్చారంటూ ఇచ్చిన కౌంటర్ కూడా ఇలాంటిదే..
సంచైత కౌంటర్లకు అంతా గప్ చుప్...
మాన్సాస్ ఆస్తుల పరిరక్షణ పేరుతో సంచైతను టార్గెట్ చేసిన బాబాయ్ అశోక్, టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆమె ఇచ్చిన కౌంటర్లతో దిమ్మతిరిగినట్లయింది. సంచైత కౌంటర్లకు ఇప్పటికీ వీరిద్దరి దగ్గర సమాధానం లేదు. కనీసం ఆమెపై చేసి ఒక్క ఆరోపణపై అయినా కౌంటర్ కు సమాధానం ఇవ్వలేని పరిస్ధితుల్లో అశోక్, చంద్రబాబు మౌనం వహించడం సంచైతకు భారీ గెలుపుగా మాన్సాస్ వ్యవహారాల్ని కొంతకాలంగా నిశితంగా గమనిస్తున్న వారు చెబుతున్నారు. మారిన సీన్ తో తన దూకుడు మరింత పెంచేందుకు సంచైత సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
జేజమ్మ మాటలే కాదు చేతలు కూడా...
మాన్సాస్ బాధ్యతలు చేపట్టకముందు యూత్ డ్రెస్సుల్లో హంగామా చేసిన సంచయిత మాన్సాస్ బాధ్యతలు చేపట్టగానే రాజవంశీయుల తరహాలో చీరల్లోనే దర్శనమిస్తున్నారు. మాటల్లోనూ పరిణతి కనబరుస్తున్నారు. చేతల్లోనూ రాటు దేలుతున్నారు. తాజాగా బాబాయ్ అశోక్, టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన విమర్శలకు ఓ రేంజ్ లో కౌంటర్లు ఇచ్చిన సంచైత... త్వరలో తాను ఇచ్చిన కౌంటర్లకు మద్దతుగా అప్పటి వ్యవహారాలను తవ్వితీసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మాన్సాస్ హోదాలో ఉంటూ అధినేత చంద్రబాబు చెప్పినట్టల్లా ఆడిన బాబాయ్ అశోక్ ను ఇరుకునపెట్టేలా ఇవి ఉండబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే మాన్సాస్ చరిత్రలో అశోక్ గజపతిరాజు పాత్ర, ముద్ర కూడా కనుమరుగు కావడం ఖాయమంటున్నారు.