తిరుమల లడ్డూల పవిత్రత పునరుద్ధరణ: ఇక టీటీడీకి నందిని నెయ్యి
తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ పవిత్రతను పునరుద్ధరించామంటూ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తాజాగా వెల్లడించింది. లడ్డూ అపవిత్రంపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేస్తూ ఎక్స్ వేదికగా టీటీడీ స్పందించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాల పవిత్రత పునరుద్ధరించామంటూ ఆ పోస్టులో పేర్కొంది. అంతేగాక, గతంలో ఉపయోగించిన నెయ్యి, ప్రస్తుతం వినియోగించిన నెయ్యి వివరాలను వెల్లడించింది.
నెయ్యి కల్తీని నిర్ధారించిన ల్యాబ్ రిపోర్టును పోస్టు చేసింది. అదేవిధంగా నందిని డెయిరీ నెయ్యి ల్యాబ్ రిపోర్టును కూడా పక్కనే పోస్టు చేసింది. లడ్డూ నాణ్యతపై భక్తుల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు ప్రయత్నించింది. నాణ్యమైన నందిని నెయ్యి వాడకంతో మళ్లీ తిరుమల లడ్లూ పవిత్రత చేకూరిందని తెలిపింది. భక్తులకు తిరిగి నిజమైన నేతి లడ్డూల అనుభూతి లభిస్తోంది.

కాగా, లడ్డు కల్తీ వివాదానికి ముందు తిరుపతి లడ్డూకు 20 ఏళ్లుగా స్వచ్ఛమైన నందిని నెయ్యి వాడేవారు. కానీ, 2023లో గత పాలకులు ధరల సమస్యను కారణంగా చూపుతూ నందిని నెయ్యి సరఫరాను నిలిపివేశారు. తాజా వివాదంతో తిరుమలకు స్వచ్ఛమైన నందిని నెయ్యిని మాత్రమే వాడాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
తిరుపతి లడ్డూ తయారీలో కర్ణాటకకు చెందిన స్వచ్ఛమైన నందిని నెయ్యి గత 20 ఏళ్లుగా వినియోగిస్తున్నారు. అయితే 2022-23లో ధర ఎక్కువగా ఉందనే కారణంతో తిరుపతికి నందిని నెయ్యి సరఫరా నిలిపివేశారు. టీటీడీకి 2013-14 నుంచి 2021-22 వరకు 5 వేల టన్నుల నెయ్యిని కేఎంఎఫ్ (Karnataka Milk Federation) సరఫరా చేసింది. 2022-23లో KMF నెయ్యిని సరఫరా చేయలేదు. అధిక ధర ఉందనే కారణంగా చూపుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నందిని నెయ్యి టెండర్ని తిరస్కరించింది. దీంతో కల్తీ నెయ్యి వాడకం వెలుగులోకి వచ్చింది.
The Sanctity of Srivari Laddu Prasadam is Restored Again#SrivariLaddu#TirumalaLaddu#LadduPrasadam#TTD#TTDAdministration #TTDevasthanams#OldSuppliers#NewSuppliers#LabReport#Ghee#SValue#GheeQuality pic.twitter.com/1aEhLonqzt
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) September 21, 2024
అయితే, తాజాగా, 2024-25 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి 350 మెట్రిక్ టన్నుల నందిని నెయ్యిని సరఫరా చేయాలని ఆర్డర్ ఇచ్చారు. కిలో నందిని నెయ్యిని 478 రూపాయల చొప్పున టీటీడీ.. KMF నుంచి నందిని నెయ్యిని కొనుగోలు చేస్తుంది. దీంతో ఇప్పుడు మళ్లీ తిరుమల లడ్డూకి నందిని నెయ్యి సువాసనలు జతకానున్నాయి. ఇప్పటికే టీటీడీకీ నందిని నెయ్యి చేరుకుంది. ఇకపై తిరుమల లడ్డూల తయారీకి నాణ్యమైన నందిని నెయ్యినే వినియోగించనున్నారు.












Click it and Unblock the Notifications