తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు.. కర్రసాముతో ఆకట్టుకున్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఇప్పటికే గుడివాడలో మంత్రి కొడాలి నాని సోదరుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఎడ్ల పందాలు, పలు సాంప్రదాయ క్రీడల పోటీలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూల్స్ లోనూ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. ఇక తాజాగా తూర్పు గోదావరి జిల్లా మండపేటలోనూ ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.
తూర్పు గోదావరి జిల్లాలో మొదలైన సంక్రాంతి సంబరాలు
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఏర్పాటుచేసిన ముందస్తు సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలలో వైసీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సంక్రాంతి కోలాహలం మండపేటలో పండగకు ముందే కొనసాగింది. స్వయంగా ఎడ్ల బండి పైన సాంప్రదాయ పంచె కట్టుతో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఊరేగి కార్యకర్తలలో సంక్రాంతి సంబరాల ఉత్సాహాన్ని నింపారు. అంతేకాదు కర్రసాము తో విన్యాసాలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్థానికులను ఆకట్టుకున్నారు.
ఎడ్లబండి తోలిన తోట త్రిమూర్తులు.. సంక్రాంతి ఉత్సవాల ప్రారంభం
వైయస్సార్సీపి ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను నిర్వహించిన క్రమంలో మండపేటలో సాంప్రదాయబద్ధంగా స్థానిక కలువ పువ్వు సెంటర్ నుండి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఎడ్లబండిపై వెళ్లి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీలను పురపాలక సంఘం చైర్మన్ పతివాడ నూక దుర్గా రాణి ప్రారంభించారు. భోగిమంట వెలిగించి సంక్రాంతి ఉత్సవాలను ప్రారంభించిన తోట త్రిమూర్తులు వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. పాడిపశువులను ముద్దాడారు. చిన్ననాటి సంక్రాంతి సరదాలను గుర్తు చేసుకున్నారు.
కర్రసాము చేసి అందరినీ ఆకట్టుకున్న తోట త్రిమూర్తులు
ఆపై వైసీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కర్రసాముతో విన్యాసాలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. బాల్యంలో నేర్చుకున్న కర్రసామును నేటికీ అద్భుతంగా ప్రదర్శించారు తోట త్రిమూర్తులు. తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టుతో ఎంత ఉత్సాహంతో కర్రసాము చేసిన వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ నేతలను, కార్యకర్తలను ఉత్సాహవంతులను చేశారు. సాంప్రదాయ క్రీడల్లో భాగంగా అందరినీ చైతన్యపరచడం కోసం ఈ విధమైన ఆటలు ఎంతో దోహదపడతాయని, తాను సాంప్రదాయాలకు విలువ ఇవ్వడం లో ఎప్పుడూ ముందు ఉంటానని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ సందర్భంగా వెల్లడించారు.
Recommended Video
వైసీపీ సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్న పార్టీ శ్రేణులు, ప్రజలు
సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా చిన్నప్పుడు ఆడిన ఆటలను గుర్తు చేసుకున్న తోట త్రిమూర్తులు, సాంప్రదాయాలకు, సాంప్రదాయ పండుగలకు తెలుగు రాష్ట్రాలు పెట్టింది పేరని పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంక్రాంతి ఉత్సవాలలో స్థానిక వైసిపి నాయకులు, ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. అటు రాజకీయ రంగంలోనే కాకుండా, సాంప్రదాయ క్రీడల్లోనూ తోట త్రిమూర్తులు చూపించిన ప్రతిభ పట్ల కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కర్రసాము చేస్తున్నంతసేపు హర్షధ్వానాలతో ముంచెత్తారు.