ఏపీ పాఠ్య పుస్తకాల్లో సత్య నాదెళ్ల, మల్లి మస్తాన్ బాబు, అమరావతి
విజయవాడ: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబుల గురించి పాఠ్యాంశాల్లో పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. వీరి జీవితాల గురించి రానున్న విద్యా సంవత్సరం నుంచి పాఠ్య పుస్తకాల్లో విద్యార్థులకు బోధించనున్నారు.
సత్య నాదెళ్ల జీవితం ఏపీలోని నిమిదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశం కానుంది. రానున్న విద్యా సంవత్సరం జూన్ 2016 నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థుల తెలుగు ఉపవాచక పుస్తకంలో 'స్ఫూర్తిప్రదాతలు' అనే శీర్షికతో కొత్త పాఠాలను చేర్చింది.
ఈ మేరకు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసర్చ్ అండ్ ట్రెయినింగ్ చర్యలు తీసుకుంటోంది. ఎనిమిదో తరగతి తెలుగు ఉపవాచకంలో సత్య నాదెళ్లతో పాటు ప్రపంచంలోని ఏడు ఎతైన శిఖరాలను అధిరోహించిన స్వర్గీయ మల్లి మస్తాన్ బాబు, ప్రఖ్యాత రచయిత, చిత్రకారుడు స్వర్గీయ సంజీవ్ దేవ్ జీవిత కథలను చేర్చనున్నారు.
అలాగే ఏడో తరగతి తెలుగు ఉపవాచకంలో కూచిపూడితో పాటు హరికథ, బుర్రకథ, తప్పెటగుళ్లు వంటి జానపద కళలను తెలియచేసే విధంగా పాఠ్యాంశాలను చేర్చనున్నారు. పదో తరగతి విద్యార్థులకు కూడా 'మన రాజధాని' అనే శీర్షికతో అమరావతి చరిత్రను, ప్రాముఖ్యాన్ని తెలియచేసే అంశాలను ఉపవాచకంలో చేర్చనున్నారు.
మల్లి మస్తాన్ బాబుకు భారతరత్న ఇవ్వాలి
మల్లి మస్తాన్ బాబుకు భారతరత్న పురస్కారాన్ని ఆయన సోదరి దొరసానమ్మ విజ్ఞప్తి చేస్తున్నారు. భారతరత్నకు మస్తాన్ బాబు అర్హుడన్నారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలో కొత్తగా 50 అసెంబ్లీ స్థానాలు
ఏఫీలో ఇప్పుడుండే అసెంబ్లీ స్థానాలే కాకుండా కొత్తగా మరో 50 అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయని కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి చెప్పారు. చంద్రబాబు చేసిన అభివృద్ధిని చూసే వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారన్నారు. అభివృద్ధిని కోరుకునే వారు టిడిపిలోకి రావొచ్చని చెప్పారు.