ఆస్థి కోసం చెల్లి దారుణం:మంచం పట్టిన అక్కను కాలితో తన్ని చెప్పుతో కొట్టి...ఇంకా...
రాజమహేంద్రవరం: ఆస్థుల ముందు అనుబంధాలు...రక్త సంబంధాలు ఏమాత్రం ఆనడం లేదనడానికి నిఖార్సైన రుజువు ఇది. ఓపిక ఉన్నన్నాళ్లూ కష్టపడింది...తృణమో ఫణమో సంపాదించింది...ఆ తరువాత వయసు మళ్లింది...వృద్ధాప్యానికి తోడు పక్షవాతం వచ్చింది.
దీంతో తన సంరక్షణ చూడమంటూ అన్నాళ్లూ తానుకు కష్టపడి సంపాదించినదంతా చెల్లి వరసైన సమీప బంధువుకు అప్పగించింది. అయితే ఇంకా ఆస్థి కావాలంటూ ఆమె పట్ల అత్యంత కర్కశంగా ప్రవర్తిస్తోంది. చిత్రహింసలు పెడుతోంది. పక్షవాతం వచ్చిన ఒక వృద్దురాలి పట్ల ఆమె చెల్లెలి ప్రవర్తన చూసి హృదయం ద్రవించిన పొరుగింటి యువకుడు ఈ దారుణాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ వృద్దురాలు బతికిపోయింది. ఆ కసాయి చెట్టి కటకటాల పాలైంది. వివరాల్లోకి వెళితే...
వృద్దురాలి...వివరాలు
తూర్పుగోదావరి జిల్లా పెనికేరు గ్రామానికి చెందిన పంతం పుష్పవతి భర్త చనిపోవడంతో రాజానగరం పరిధి నరేంద్రపురంలో ఉండే తన సమీప బంధువు, చెల్లెలు వరసయ్యే ప్రగడ మంగాదేవి వద్దకు మకాం మార్చింది. చెల్లెలయిన మంగాదేవికి కూడా భర్త లేడు, కొడుకుతో కలసి జీవనం సాగిస్తోంది. చెల్లెలి వద్దకు చేరిన పుష్పవతి ఆ ఇంట్లో వారితో కలసి ఉంటూ కూలి పనులకు వెళుతూ వచ్చిన సొమ్మును తన పోషణ కోసం చెల్లికి ఇస్తూ ఉండేది. అయితే ఏడాది కిందట పుష్పవతికి పక్షవాతం రావడంతో మంచానికే పరిమితమైంది.
పుష్పావతి...ఆమె పేర స్థలం
అయితే పుష్పవతికి పెనికేరులో కొంత ఇంటి స్థలం ఉంది. అది ఆమె తన సోదరులకు చెందేలా రాయాలనుకునేది. అయితే పక్షవాతం వచ్చి మంచాన పడి ఉన్న ఆమెను తాను చూస్తున్నందును అది తన పేర రాస్తుందనే ఆశ మంగాదేవిలో ఉండేది. అయితే ఎన్ని సార్లు అడిగినా ఆమె అందుకు నిరాకరించడంతో మంగాదేవి మంచంపై ఉన్న పుష్పవతిని చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టింది.
స్థానికులు నిలదీయడంతో...ఇల్లు మార్చింది
మంచాన పడి ఉండే పుష్పవతిని మంగాదేవి పెడుతున్న చిత్రహింసలు చుట్టుప్రక్కల వారి దృష్టికి వెళ్లడంతో వారంతా ఆమెని నిలదీశారు. సక్రమంగా చూసుకోమని హెచ్చరించారు. దీంతో ఆమె మూడు నెలల కిందట అక్కడి నుంచి ఇల్లు ఖాళీచేసి నగరంలోని లాలాచెరువు హౌసింగ్బోర్డు కాలనీలో మరో ఇల్లు అద్దెకు తీసుకుని మకాం అక్కడకు మార్చింది.
చిత్రహింసలు..సోషల్ మీడియాలో పోస్ట్
అక్కడకు చేరింది మొదలు ఇంటి స్థలం రాసివ్వాలంటూ ఆ వృద్దురాలిపై చిత్రహింసలు పతాక స్థాయికి చేరాయి. వృద్ద రోగి అయిన అక్కను ఎగిరెగిరి కాలుతో తన్నుతూ, చెప్పులతో కొడుతూ నరకం చూపింది. ఈ చిత్రహింసల దృశ్యాలను చూసిన ఒక స్థానిక యువకుడు తన సెల్ఫోన్లో ఈ దారుణాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. దీంతో ఈ వృద్ధురాలిపై చెల్లి చిత్రహింసల విషయం బైటకు వచ్చింది. దీంతో ఇక్కడి స్థానికులు ఆదివారం సాయంత్రం ఆమెని నిలదీయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు చావు బతుకుల్లో ఉన్న అక్క పుష్పవతిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి తరలించి చికిత్స చేయిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు మంగాదేవిని బొమ్మూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.