చంద్రబాబు నిర్ణయాలపై జగన్ సర్కార్ సిట్-సుప్రీం విచారణ పూర్తి-తీర్పు రిజర్వ్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. ఈ సిట్ దర్యాప్తు పూర్తి చేసినా పెద్దగా అక్రమాలేవీ బయటపడలేదు. అదే సమయంలో సిట్ ఏర్పాటుపై టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు.. సిట్ దర్యాప్తుపై స్టే ఇచ్చింది. అయినా వైసీపీ ప్రభుత్వం పట్టు వీడలేదు.
చంద్రబాబు హయాం నిర్ణయాలపై సిట్ దర్యాప్తు ముందుకు సాగకుండా హైకోర్టు ఇచ్చిన స్టేపై వైసీపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్ హైకోర్టు స్టే తర్వాత కూడా సిట్ విచారణ సాగించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అయితే ప్రభుత్వ న్యాయవాది మాత్రం సర్కార్ కు ఆ అధికారం ఉందని సుప్రీంకోర్టుకు తెలిపారు. అనంతరం ఇరుపక్షాల వాదోపవాదాలు విన్న సుప్రీంకోర్టు విచారణ పూర్తయినట్లు ప్రకటించి తీర్పును రిజర్వ్ చేసింది.
సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఇవాళ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రతివాదులైన టీడీపీ నేతల తరపున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్ధ దవే వాదించారు. రాజకీయ దురుద్దేశంతోనే సిట్ను ఏర్పాటు చేశారని సిద్దార్థ దవే సుప్రీం దృష్టికి తెచ్చారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై సిట్ దర్యాప్తు ఔచిత్యాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నిన్న ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ తన వాదనలు వినిపించారు. దీంతో వాదనలు ముగిశాయి.