అమరావతిపై సుప్రీం ట్విస్ట్-రాజధానిపై పార్టీల మౌనం అందుకేనా ? ఎటూ తేల్చుకోలేక !
అమరావతి రాజధాని విషయంలో హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులో కొన్ని అంశాలపై సుప్రీంకోర్టు ఇవాళ స్టే ఇచ్చింది. ముఖ్యంగా అమరావతి రాజధాని అభివృద్ధి కోసం గతంలో హైకోర్టు విధించిన నెల, ఆరునెలల గడువుల విషయంలో సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్టే మంజూరు చేసింది. అదే సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు మరోసారి ఏపీలో రాజకీయ పార్టీలు కొంతకాలంగా వ్యవహరిస్తున్న తీరు వెనుక అసలు కారణంగా నిర్ధారణ అయింది. సుప్రీంకోర్టు ఇలా ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో రాజధానులపై పార్టీలు మౌనమే బెటరని భావిస్తున్నాయి.

సుప్రీంకోర్టు తాజా ట్విస్ట్
అమరావతి రాజధాని విషయంలో హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై అటు ప్రభుత్వం,ఇటు రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం కోరుతుండగా.. యథాతథంగా అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. దీంతో ప్రాథమిక విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులోని గడువుతో సంబంధం ఉన్న అంశాలపై స్టే దొరికింది. అయితే ఇది అటు ప్రభుత్వంతో పాటు విపక్షాలు కూడా ఎవరికి వారు ఊరటగా చెప్పుకుంటున్నా వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉందన్న వాదన వినిపిస్తోంది.

రాజకీయ పార్టీల మౌనం ఇందుకే !
సుప్రీంకోర్టులో రాజధానుల అంశం చేరిన తర్వాత రాజకీయ పార్టీలు దాదాపుగా మౌనం వహిస్తున్నాయి. వైసీపీ నేతలు గతంలో విశాఖ గర్జన తర్వాత సైలెంట్ అయినట్లు కనిపిస్తున్నారు. గడప గడపకూ ప్రభుత్వంలో మాత్రం మూడు రాజధానుల ప్రస్తావన తెస్తున్నారు. రాష్ట్రస్దాయిలో మాత్రం వైసీపీ మౌనం వహిస్తోంది. అదే సమయంలో అమరావతి రైతులు పాదయాత్ర నిలిపేశారు. దీంతో విపక్షాలు సైతం మౌనంగా ఉండిపోతున్నాయి. అమరావతి రాజధాని గురించి ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్ట పడటం లేదు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ట్విస్ట్ తరహాలోనే మరికొన్ని ట్విస్టులు తప్పవన్న భావనే.

ఎటూతేల్చుకోలేని వైనం ?
సుప్రీంకోర్టులో అమరావతి రాజధానిపై దాఖలైన పిటిషన్లపై ఏ క్షణాన ఏ ఉత్తర్వులు అయినా వెలువడే అవకాశముంది. దీంతో అప్పటివరకూ ఓ వాదన బలంగా వినిపించినా సుప్రీం ఉత్తర్వులతో డిఫెన్స్ లో పడాల్సి వస్తుందన్న భయం రాజకీయ పార్టీల్నివెంటాడుతోంది. దీంతో ప్రస్తుతానికి వైసీపీ మూడు రాజధానులపైనా, టీడీపీ, జనసేన, బీజేపీ అమరావతిపైనా మాట్లాడటం తగ్గించేసాయి. ఇవాళ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల తర్వాత కూడా రాజకీయ పార్టీలు వెంటనే స్పందించలేదు. ప్రస్తుత పరిస్ధితుల్లో రాజధానుల విషయంలో బలంగా ఓ అజెండా తీసుకునేందుకు కూడా పార్టీలు లోలోపల జంకుతున్నాయి. పైకి మాత్రం వైసీపీ మూడు రాజధానులకు, విపక్షాలు అమరావతికి మద్దతుగా ఉన్నట్లు చెప్పుకుంటున్నా లోలోపల మాత్రం వారిని సుప్రీంకోర్టు తీర్పు భయం వెంటాడుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications