రఘురామపై సీఐడీ కస్టడీలో దాడి కేసు-సీబీఐ దర్యాప్తుపై సీబీఐ, కేంద్రానికి సుప్రీం నోటీసులు
ఏపీలో ఏడాది క్రితం కలకలం రేపిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీఐడీ కస్టడీలో దాడి కేసు ఇవాళ మరోసారి సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. రఘురామకృష్ణంరాజుపై సీఐడీ కస్టడీలో దాడి చేశారని ఆరోపిస్తూ ఆయన కుమారుడు భరత్ గతంలో సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరారు. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
రఘురామకృష్ణంరాజుపై ఏపీ సీఐడీ కస్టడీలో దాడి జరిగిన వ్యవహారంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలా వద్దా అనే దానిపై ఇవాళ విచారణ జరిగింది. దీనిపై సుప్రీంకోర్టు.. తమ స్పందన తెలియజేయాలంటూ సీబీఐతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వీరు ఇచ్చే వివరణ ఆధారంగా సీబీఐ దర్యాప్తుపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. సీబీఐ, కేంద్రం తమ కౌంటర్లు దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు రెండు వారాల గడువు ఇచ్చింది. దీనిపై తదుపరి విచారణ నాలుగు వారాల తర్వాత నిర్వహించాలని నిర్ణయించింది.
గతంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును రాజద్రోహం కేసులో హైదరాబాద్ లో అరెస్టు చేసిన ఏపీ సీఐడీ అధికారులు.. గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అనంతరం వైద్య పరీక్షల కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి, రమేష్ ఆస్పత్రికి కూడా తీసుకెళ్లారు.
అయితే ఆ లోపు సీఐడీ కస్టడీలో తనపై దాడి జరిగిందని రఘురామ ఆరోపించారు. సుప్రీంకోర్టులో ఆయన కుమారుడు భరత్ ... తన తండ్రిపై సీఐడీ అధికారులు చేసిన దాడిపై సీబీఐ దర్యాప్తు కోరారు. అప్పట్లో రఘురామపై దాడిని నిర్ధారించిన సుప్రీంకోర్టు.. ఆయనకు బెయిల్ ఇచ్చింది. అయితే ఈ కేసులో సీబీఐ దర్యాప్తుపై మాత్రం విచారణ ఆలస్యమవుతూ వస్తోంది.