రఘురామ కేసులో ట్విస్ట్-జగన్ సర్కార్ ను ప్రతివాదిగా చేర్చాలని సుప్రీం ఆదేశం-సీబీఐ దర్యాప్తుపై
ఏపీలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై రాజద్రోహం కేసులో అరెస్టు చేసిన సీఐడీ కస్టడీలో జరిపిన వేధింపుల వ్యవహారం ఇవాళ సుప్రీంకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతూ రఘురామ కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
వైసీపీ ఎంపీ రఘురామ రాజు కస్టోడియల్ టార్చర్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది . కస్టోడియల్ టార్చర్ పై విచారణ చేపట్టాలంటూ ఎంపీ రఘురామ తనయుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు.. ఈ కేసులో ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో తమకు రెండు వారాల సమయం కావాలని భరత్ తరపు లాయర్ ఆదినారాయణరావు సుప్రీంకోర్టును కోరారు. దీంతో ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చిన తర్వాత సీబీఐ విచారణకు ఆదేశించే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది
విచారణ సందర్భంగా పిటిషనర్ పలు అంశాల్ని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. ఇందులో ఎంపీ రఘురామరాజు తన సొంత నియోజకవర్గంలో ప్రధాని పర్యటన జరిగినా రానీయకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుకుందని లాయర్ తెలిపారు. రఘురామను గత రెండున్నరేళ్లుగా ఏపీలో అడుగుపెట్టనీయకుండా అడ్డంకులు సృష్టించారని కోర్టు దృష్టికి తెచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వమే కస్టోడియల్ టార్చర్కు గురిచేసినందున రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాల్సిన అవసరం లేదని లాయర్ తెలిపారు. అయితే ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చి వాదన తెలుసుకున్నాకే సీబీఐ విచారణపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది.