ట్యాపింగ్: 'సుప్రీం చెప్పింది, డేటా ఇవ్వాలి', తెలంగాణ హెచ్చరికపై ఆందోళనొద్దు!
విజయవాడ: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 31వ తేదీలోగా కాల్ డేటాను సీల్టు కవరులో ఇవ్వాలని విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. కాల్ డేటా ఇచ్చేందుకు మరికొంత సమయాన్ని సర్వీస్ ప్రొవైడర్లు కోరారు.
దీనిని ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరెక్టర్ రామకోటేశ్వర రావు వ్యతిరేకించారు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత సమయం ఎలా అడుగుతారని వాదించారు. దీంతో ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించారు.
ఈ నెల 31వ తేదీలోగా 24 నెంబర్ల సిడిఆర్ను సీల్డ్ కవరులో ఇవ్వాలని సర్వీస్ ప్రొవైడర్లకు కోర్టు ఆదేశించింది. ఇరువైపుల న్యాయవాద ప్రతివాదనల అనంతరం కేసు విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విజయవాడ కోర్టుకు కాల్ డేటా ఇవ్వాలని సుప్రీం కోర్టు టెలిఫోన్ ఆపరేటర్లను ఆదేశించిన విషయం తెలిసిందే. వారంలోగా సీల్డుకవర్లో కాల్ డేటా ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్రాల ఆదేశాల పైన ఆందోళన చెందవద్దని ఆపరేటర్లకు సూచించింది.