రఘురామకు సుప్రీంలో ఊరట-ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షలు-బెయిల్పై శుక్రవారం విచారణ
ఏపీ ప్రభుత్వంతో పాటు సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యల కేసులో సీఐడీ విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఇవాళ సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు జరిగిన వైద్య పరీక్షల్లో ఆయనకు గాయాలేవీ కాలేదని తేలిన నేపథ్యంలో రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్ధానం కీలక ఆదేశాలు జారీ చేసింది. రఘురామను సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని సుప్రీం ఆదేశాలు ఇచ్చింది.
రఘురామకు భారీ ఊరట
ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్పై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఏపీ సీఐడీ అరెస్టు చేసిన వైసీబీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఇవాళ సుప్రీంకోర్టులో భారీఊరట లభించింది. ఆయన వైద్యపరీక్షలపై నెలకొన్న సస్పెన్స్కు తెరదింపుతూ జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయ్తో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం ప్రభావం లేకుండా ఆయన వైద్య పరీక్షలకు మార్గం సుగమమైంది.
సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి రఘురామ
ఎంపీ రఘురామకృష్ణంరాజు బెయిల్, వైద్య పరీక్షల కోసం తనయుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. రఘురామను వైద్య పరీక్షల కోసం సికింద్రాబాద్లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు రఘురామ వైద్య పరీక్షల కోసం ముగ్గురు సభ్యులతో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. దీంతో ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా రఘురామకు వైద్య పరీక్షలు జరిపించాలన్న ఆయన న్యాయవాదుల కోరికను మన్నించినట్లయింది.
రఘురామ వైద్య పరీక్షలపై సుప్రీం షరతులివే
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును వైద్య పరీక్షల కోసం సికంద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేఫథ్యంలో పలు ఆదేశాలు కూడా ఇచ్చింది. రఘురామ తన వైద్యపరీక్షలకు అయ్యే ఖర్చులు ఆయనే భరించాలని కోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి సమక్షంలో వైద్య పరీక్షలు జరగాలని, వీటి వీడియో తీసి సీల్డ్ కవర్లో తమకు సమర్పించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో రఘురామ ఉండే సమయాన్ని జ్యుడిషియల్ కస్టడీగా పరిగణించాలని కూడా తెలిపింది.
బెయిల్పై శుక్రవారం విచారణ
రఘురామకృష్ణంరాజు వైద్య పరీక్షలపై కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇవి పూర్తయి రిపోర్టులు వచ్చేందుకు గడువు ఉన్న నేపథ్యంలో తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఎలాగో జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండాల్సి ఉన్నందున ఆయన బెయిల్ పిటిషన్పై శుక్రవారం తదుపరి వాదనలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ విచారణ కూడా వాయిదా పడే అవకాశాలున్నాయి.