ఏపీలో పది పరీక్షలపై సుప్రీం సుప్రీం ప్రశ్నలు-ఒక్క విద్యార్ధి ప్రాణం పోయినా మీదే బాధ్యత..
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్ణయాలు తీసేసుకున్నాయి. ఇంకా ఏపీ, కేరళ వంటి రాష్ట్రాలు మాత్రమే తమ నిర్ణయాలు ఆలస్య చేస్తున్నాయి. దీంతో అసలు పరీక్షలు జరుగుతాయో లేదో అన్న టెన్షన్ విద్యార్ధుల్లో పెరిగిపోతోంది.
ఏపీ, కేరళలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఇవాళ సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. ఇప్పటివరకూ పరీక్షల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని అత్యున్నత న్యాయస్ధానం తప్పుబట్టింది. ఇప్పటివరకూ అఫిడవిట్ దాఖలు చేయకపోవడాన్ని ప్రశ్నించింది. రెండు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఏఫీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

పదో తరగతి పరీక్షల రద్దు విషయంలో ఏపీని ఎందుకు మినహాయించాలో చెప్పాలని సుప్రీంకోర్టు నిలదీసింది. ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్రమే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించింది.విద్యార్దుల ఆరోగ్య భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పరీక్ష హాల్లో 15 నుంచి 20 మందిని మాత్రమే అనుమతిస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఇద్దరు విద్యార్ధుల మధ్య 5 ఆడుగుల భౌతిక దూరం పాటిస్తామన్నారు. పదో తరగతి విద్యార్దులకు గ్రేడ్లు మాత్రమే ఇస్తున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపారు. దీనివల్ల మార్కుల ప్రాతిపదికన పోలిక ఉండదని తెలిపారు.
సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తరహాలో ఇంటర్నల్ మార్కులపై నియంత్రణ, పర్యవేక్షణ లేదన్నారు. ఎంసెట్లో ప్రతిభను ఇంటర్ 12వ తరగతి మార్కుల ఆధారాంగా నిర్ధారిస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే పరీక్షలకు అనుమతిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. అలాగే ప్రభుత్వం కోర్టులో చెప్పిన విషయాలన్నీ అఫిడవిట్లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది.












Click it and Unblock the Notifications