ఫర్నీచర్ విసిరేసి స్కూల్లో టీచర్ వీరంగం, 300 మందికి రూ.3 కోట్ల టోకరా
అనంతపురం/విశాఖ: జిల్లాలోని అనకాపల్లి మండలం కొండకొప్పాక గ్రామం పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలు వీరంగం సృష్టించారు. బుధవారం పాఠశాలలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. విద్యార్థులు, సహా ఉపాధ్యాయుల పైన తిట్ల దండకం అందుకున్నారు.
సదరు ఉపాధ్యాయురాలు పేరు విజయలక్ష్మి అని తెలుస్తోంది. ఆమె గతంలో పని చేసిన చోట కూడా ఇలాగే ప్రవర్తించినట్లు చెబుతున్నారు. రోజంతా బాగానే ఉంటుందని, హఠాత్తుగా అప్పుడప్పుడు పిచ్చి ఎక్కినట్లు వీరంగం చేస్తుందని చెబుతున్నారు.
గతంలోను విద్యార్థుల పైన, పాఠశాల సిబ్బంది పైన దాడి చేసిందని అంటున్నారు. ఈమె వ్యవహార శైలి పైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ రోజు అయితే మరీ దారుణంగా ప్రవర్తించిందని, కుర్చీలను విసిరికొట్టిందని చెబుతున్నారు. విజయలక్ష్మి వింత ప్రవర్తనకు కుటుంబ సమస్యలు కారణం కావొచ్చంటున్నారు.
అనంతలో రూ.3 కోట్లు శఠగోపం
అనంతపురం జిల్లాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి దాదాపు 300 మంది నిరుద్యోగులకు రూ.3 కోట్లు శఠగోపం పెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, కొంత మొత్తం చెల్లిస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని నిందితులు బాధితులకు చెప్పారు.
దీంతో 300 మంది దాకా ఉద్యోగాల కోసం నిందితులకు డబ్బులు ఇచ్చారు. ఎన్నిసార్లు తిరిగినా ఉద్యోగం ఇవ్వలేదు. తాజాగా, బోర్డు తిప్పేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నాడు. అతనికి రాజకీయ అండదండలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.