విజయవాడ డివిజన్ పరిధిలో పెరగనున్న రైళ్ల వేగం-లేటెస్ట్ ఇదే..!
ఏపీలోని విజయవాడ డివిజన్ లో రైళ్ల వేగం మరింత పెరగబోతోంది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న ఈ డివిజన్ లో రైల్వే ట్రాక్ లను వరుసగా అప్ గ్రేడ్ చేస్తూ వస్తున్న అధికారులు మరో మైలురాయిని అధిగమించారు. ఇప్పటి వరకూ ఈ డివిజన్ పరిధిలో 1287.764 ట్రాక్ కిలోమీటర్లను అప్ గ్రేడ్ చేయడం ద్వారా వీటిపై రైళ్లను గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా చేశారు. ఈ ఫీట్ పై డీఆర్ఎం నరేంద్ర పాటిల్ అధికారుల్ని అభినందించారు.

విజయవాడ డివిజన్ పరిధిలో ఉన్న రైల్వే ట్రాక్స్ లో 58 శాతాన్ని అప్ గ్రేడ్ చేయడం ద్వారా రైళ్లను గరిష్ట వేగం 130 కిలోమీటర్లతో ప్రయాణించేలా చేసినట్లు అధికారులు ఇవాళ వెల్లడించారు. అలాగే బ్రాంచ్ లైన్లో (నిడదవోలు-భీమవరం-నరసపూర్-గుడివాడ-మచిలీపట్నం మరియు కాకినాడ పోర్ట్-సామల్కోట్) సెక్షన్లలో అయితే 473.4 ట్రాక్ కిలోమీటర్లను 110 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేలా అప్ గ్రేడ్ చేశారు. ఈ లెక్కన చూస్తే విజయవాడ డివిజన్ లో కనిష్టంగా 110 కిలోమీటర్లు, గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేందుకు అవకాశం లభించింది.

విజయవాడ డివిజన్ పరిధిలో పటిష్టమైన భద్రతా చర్యలు, శాశ్వత వేగ పరిమితులను తొలగించడం, వక్రరేఖల పునర్నిర్మాణం, కఠినమైన ట్రాక్ నిర్వహణ షెడ్యూల్లు, డివిజన్ చుట్టూ కదలికను పరిమితం చేసే మౌలిక సదుపాయాల అడ్డంకులను తొలగించడం వల్ల ఈ ఫీట్ సాధ్యమైనట్లు అధికారులు తెలిపారు. విజయవాడ డివిజన్లో మొత్తం 1070.83 కి.మీ రూట్ కిమీ, 2228.35 ట్రాక్ కిమీ (ఆర్కెఎమ్ - ఒక మార్గంలో ట్రాక్ల సంఖ్య) ఉన్నాయి. విజయవాడ డివిజన్లో దాదాపు 1/4వ వంతు మట్టి ఒడ్డు నిర్మాణంతో కప్పబడి ఉంది. దీని వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తుతం అధిగమించారు. దీంతో ఈ రూట్ లో ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications