టీడీపీలో స్క్రాప్ అంతా బయటకు పోతుంది... నాడు-నేడు ప్రోగ్రాం ఒక బోగస్ : బోండా ఉమా
టిడిపి నేత బోండా ఉమా మరోమారు పార్టీ నుండి బయటకు వెళ్లిన నేతలపై విమర్శలు చేశారు. ప్రస్తుతం ఏపీలో టిడిపి నుండి బయటకు వెళ్లిన నేతలు, అలాగే వైసిపి నేతలు, టిడిపి నేతలపై మాటల దాడికి దిగుతుంటే టిడిపి నేతలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే టిడిపి నేత బోండా ఉమా జంపు జిలానీల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల బయటకు వెళ్ళిన నేతలతో తమ పార్టీలోని స్క్రాప్ బయటకు వెళ్లిపోయిందని టీడీపీ నేత బోండా ఉమ స్పష్టం చేశారు. ఇక పార్టీ వీడి వెళ్లిన నేతలు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించారని విమర్శించారు. అధికార వ్యామోహంతోనే వారు పార్టీని వీడి వెళ్లారని, వాళ్లకు సిద్ధాంతాల కంటే అధికారమే ముఖ్యమని బోండా ఉమా ఫైర్ అయ్యారు. రేపు టీడీపీ అధికారంలోకి వస్తే సొంత గూటికి వచ్చామని తిరిగి టీడీపీలో చేరతారన్నారు. ఇక అంతే కాదు అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి పార్టీ మారే నేతలను జగన్ సైతం నమ్మడు అని బొండా ఉమా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు వైసీపీ పచ్చగా ఉందని వెళితే రేపు ఎండటం ప్రారంభమవుతుందని పేర్కొన్న బోండా ఉమా ఎండటం ప్రారంభంకాగానే బయటికి వచ్చేస్తారని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో
అధికారంలో ఉన్న వైయస్ఆర్సీపీ ప్రారంభించిన నాడు-నేడు కార్యక్రమం ఒక బోగస్ కార్యక్రమమని టీడీపీ నేత బోండా ఉమ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని బోండా ఉమా వ్యాఖ్యానించారు.
ఆంగ్ల భాషను తామే కనిపెట్టినట్లు గా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని బోండా ఉమ నిప్పులు చెరిగారు. ఇంగ్లీష్ భాష అవసరం గురించి మొదట స్పందించింది తెలుగుదేశం పార్టీని అని బోండా ఉమ పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 'ఇంగ్లీష్ వద్దు.. తెలుగు ముద్దు' అన్న వైసీపీ నేతలు ఇప్పుడు తెలుగు వద్దు ఇంగ్లీష్ ముద్దు అంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు బోండా ఉమ. అధికారంలోకి రాగానే మాతృభాష వద్దు అంటున్నారని పేర్కొన్నారు. మొత్తానికి బోండా ఉమా పార్టీ వీడి వెళ్లిన నేతల పైన, అలాగే వైసిపి చేస్తున్న కార్యక్రమాల పైన విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications