ఏపీలో మరో ఎన్నికల సమరం - ఎన్నికల సంఘం సన్నాహాలు..!!
ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. వరుసగా జరిగిన స్థానిక సంస్థలు...మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే, ఇప్పుడు నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు మరో 12 పురపాలక సంఘాల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే వీటికి సంబంధించిన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ ను జారీ చేసింది. గుర్తించిన పోలింగ్ కేంద్రాల వివరాలతో ఈనెల 19న ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేయాలని కలెక్టర్లను ఎన్నికల సంఘం ఆదేశించింది.
12 మున్సిపాల్టీల్లో ఎన్నికల కోసం
వీటిపై ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి 23న తుది నోటిఫికేషన్ ఇవ్వాలని స్పష్టం చేసింది. అందులో భాగంగా నెల్లూరు కార్పోరేషన్ ఎన్నిక కీలకం కానుంది. కోర్టులో కేసుల్లో ఉన్న పురపాలక సంఘాలతో పాటుగా.. అభ్యంతరాలు లేని చోట్ల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
నెల్లూరు నగరపాలక సంస్థతోపాటు బుచ్చిరెడ్డిపాళెం (నెల్లూరు జిల్లా), ఆకివీడు (పశ్చిమ గోదావరి), జగ్గయ్యపేట, కొండపల్లి (కృష్ణా), గురజాల, దాచేపల్లి (గుంటూరు), దర్శి (ప్రకాశం), కుప్పం (చిత్తూరు), బేతంచెర్ల (కర్నూలు), కమలాపురం, రాజంపేట (కడప), పెనుకొండ (అనంతపురం) పురపాలక సంఘాల్లో పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయాలని ఆదేశించింది.
డివిజన్లు-వార్డుల ఉప ఎన్నికలు సైతం
ఎన్నికల సంఘం తాజాగా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సమాచారం సిద్దం అయిన తరువాత వీటిల్లో ఎన్నికల నిర్వహణ పైన ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. నవంబర్ 15 తరువాత ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే విధంగా మరో 20 పుర, నగరపాలక సంస్థల్లోనూ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మృతి చెందడంతో ఖాళీ అయిన స్థానాలకూ ఎన్నికలు నిర్వహించే విషయం పైన అధికారులు ఫోకస్ చేసారు. ఒక కార్పెరేషన్.. 12 మున్సిపాల్టీలతో పాటుగా ఈ వార్డులు..డివిజన్లకు సంబంధించిన ఉప ఎన్నికలు సైతం ఒకే సారి నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Recommended Video
వచ్చే నెలాఖరులోగా పూర్తి చేసే అవకాశం
ఇప్పటకే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్పోరేషన్.. మున్సిపాల్టీల ఎన్నికల్లో మొత్తం 14 కార్పోరేషన్లను అధికార వైసీపీ గెలుచుకుంది. ఇక, మున్సిపాల్టీల్లో ఒక్క తాడిపత్రి మాత్రమే టీడీపీ ఖాతాలోకి వెళ్లగా..మిగిలిన అన్ని మున్సిపాల్టీల్లోనూ వైసీపీ విజయం సాధించింది. ఇక, ఇప్పుడు ఈ ఎన్నికల్లోనూ తమ ఆధిపత్యం కొనసాగించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. అదే సమయంలో టీడీపీ వీటిలో గట్టి పోటీ ఇవ్వాలనే ఆలోచనలో ఉంది.
ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెలఖారులోగా ఎప్పుడు నిర్వహించే అంశం పైన ఒక క్లారిటీ రానుంది. ఈ నెల 30న కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ లోగానే ఈ మున్సిపల్ పెండింగ్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది.