పోలీస్ బాస్ ల సీక్రెట్ మీటింగ్...మావోయిస్టులపైనే చర్చ!
తూర్పుగోదావరి: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే సీనియర్ పోలీసు ఆఫీసర్లు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని పోలీస్ గెస్ట్ హౌస్ సోమవారం సీక్రెట్ గా సమావేశం అయినట్లు తెలిసింది. తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో మావోయిస్టుల భారీ ఎన్కౌంటర్ జరిగిన కొద్దిరోజులకే ఈ రహస్య సమావేశం జరగడం గమనార్హం. ఈ మీటింగ్, ఇందులో పాల్గొన్నవారి వివరాలను కూడా పోలీసు వర్గాలు అత్యంత రహస్యంగా ఉంచాయి.
అయితే ఈ సమావేశంలో మావోయిస్ట్ ల ఎన్కౌంటర్ లను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన పోలీసు అధికారుల అనుభవాలు, అక్కడి పరిస్థితుల గురించి సమావేశంలో చర్చించుకున్నట్లు తెలిసింది. అలాగే మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న కిట్బ్యాగుల్లో దొరికిన డాక్యుమెంట్లు, వారి ల్యాప్ ట్యాప్ లలో నిక్షిప్తం చేయబడిన సమాచారం ఆధారంగా వారి వ్యూహాలు, ఫ్యూచర్ దాడుల గురించి విశ్లేషించే దిశలో సైతం చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ సీక్రెట్ మీటింగ్ గురించి పోలీసులు ఎంత గోప్యంగా ఉంచినప్పటికీ, అక్కడకు వచ్చిన అధికారుల తీరు, హోదాలను బట్టి...అది అతి ఉన్నత స్థాయి పోలీస్ అధికారుల సమావేశం అని తెలిసిపోయింది. ముందుగా వీరంతా ఆంధ్ర- ఒడిసా సరిహద్దుల పరిధిలోని విశాఖ, మల్కాన్గిరి సరిహద్దు ప్రాంతాలను హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేశారు. అనంతరం రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలిప్యాడ్లో దిగి, అక్కడి పోలీస్ అతిధి గృహానికి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సీనియర్ భద్రతా సలహాదారు కె విజయ్కుమార్, గ్రేహౌండ్స్ చీఫ్ సురేంద్రబాబు, ఎస్బీఐ ఐజీ బత్తిన శ్రీనివాసులు, విశాఖ కలెక్టర్ ప్రవీణ్కుమార్, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ ఈ భేటీలో పాల్గొన్నట్టు చెబుతున్నారు. అలాగే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు చెందిన పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు.
పోలీస్ బాసుల హడావుడి విషయం తెలుసుకొన్న కొందరు మీడియా ప్రతినిధులు వారి రాక విషయమై స్థానిక పోలీసులను సంప్రదించగా, అలాంటి మీటింగ్ ఏమీ జరగడం లేదని కొట్టిపడేశారు. కేవలం ట్రైనీ ఐపీఎస్ లు కొందరు ఏజెన్సీ ప్రాంతం పరిశీలనకు వచ్చారని, అంతకుమించి మరేంలేదని అసలు విషయం దాటవేసేందుకు యత్నించారు. జిల్లాలోని పోలీస్ ఉన్నతాధికారులనే తప్ప సబ్ డివిజనల్ స్థాయి పోలీసు ఆఫీసర్లను సైతం సమావేశం జరుగుతున్న ప్రాంతం సమీపంలోకి రానీయకపోవడం గమనార్హం.
తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో మావోయిస్టుల భారీ ఎన్కౌంటర్ జరిగిన తీరు, తదనంతర పరిణామాలు, అలాగే మావోయిస్టుల చొరబాట్లను సరిహద్దులలోనే అడ్డుకోవడం వంటి విషయాలపై సమగ్ర చర్చతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో రాష్ట్రాల...జిల్లాల పోలీసుల సంయుక్త ఆపరేషన్లు చేపట్టే అంశం గురించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది. వీరప్పన్ ఎన్కౌంటర్కు స్కెచ్ రూపొందించిన విజయ్కుమార్ సలహాలను కూడా మావోయిస్టుల నిర్మూలనలో పాటించాలనే భావనతో...అందుకోసం ఆయనను వెంటపెట్టుకొని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం.