సెక్షన్ 8, ఆంధ్రులు: 'కక్షతో కేసీఆర్, అధికారం కోసం జగన్!'
హైదరాబాద్: కక్షతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, అధికారం కోసం వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కుట్రతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపణలు చేస్తున్నారు.
ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నేపథ్యంలో సెక్షన్ 8 మరోసారి తెరపైకి వచ్చింది. సెక్షన్ 8 కచ్చితంగా అమలు చేయాల్సిందేనని టీడీపీ నేతలు చెబుతుంటే, అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు చెబుతున్నారు.
గతంలో గురుకుల్ ట్రస్ట్ భూములు కూల్చిన సందర్భంలో సెక్షన్ 8 చర్చకు వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు, మంత్రులు, పలువురు అధికారుల ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో మరోసారి చర్చకు వచ్చింది.
ఓ ముఖ్యమంత్రికే భద్రత లేకుంటే హైదరాబాదులోని సామన్య ఏపీ ప్రజలకు భద్రత ఎక్కడ ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గవర్నర్ తీరును కూడా టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. ఆయనను రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సెక్షన్ 8 గిక్షన్ జాన్తా నై అని, సెక్షన్ కంటితుడుపు బిల్లు అని చెప్పడాన్ని కూడా టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు విషయంలో వైసీపీ వైఖరి ఎలా ఉన్నప్పటికీ.. సెక్షన్ 8 చర్చకు వచ్చినప్పుడు కూడా తెరాసకు మద్దతు పలుకుతున్నట్లుగా ఉందని ఆరోపిస్తున్నారు.
హైదరాబాదులో కచ్చితంగా సెక్షన్ 8 ఉండాల్సిందేనని అంటున్నారు. కాగా, సెక్షన్ 8 అంటే హైదరాబాదులో శాంతిభద్రతలకు నష్టం వాటిల్లినప్పుడేనని, హైదరాబాదులో ఏపీకి హక్కు లేదని తెరాస నేతలు వాదిస్తున్నారు.